
- హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన భట్టి విక్రమార్క
- రేసులో మహేశ్ కుమార్ గౌడ్, యాష్కీ, సంపత్, జగ్గారెడ్డి
- సామాజిక సమీకరణాలను పరిశీలిస్తున్న అధిష్టానం
హైదరాబాద్: పీసీసీ చీఫ్ ఎవరనేది ఈ రాత్రికే తేలే అవకాశం ఉంది. రాత్రి 8 గంటలకు ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ ఇప్పటికే ఆశావహుల జాబితాను రెడీ చేసినట్టు సమాచారం. ముఖ్యనేతలు అందుబాటులో ఉండాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్తగూడెం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.
మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ కు తిరిగి రావాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉండిపోయారు. ఇవాళ్టితో పీసీసీ చీఫ్ గా రేవంత్ పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఢిల్లీలోనే ఉన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కీ సోనియాగాంధీని ఇవాళ పార్లమెంటు హాలులో విడివిడిగా కలిసి తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ సీఎంగా, ఎస్సీ వర్గానికి చెందిన భట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నందున పీసీసీ చీఫ్ పదవిని బీసీలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు కేటాయిస్తే వీరిద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు అవకాశం దక్కవచ్చు.
అదే విధంగా రెడ్డి వర్గానికే పదవిని కట్టబెడితే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి చాన్స్ దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో పీసీసీ చీఫ్ ఎవరనేది క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ విస్తరణపైనా చర్చరాష్ట్ర కేబినెట్ విస్తరణపైనా ముఖ్యనేతల సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.
ఇప్పటికే మంత్రిపదవులు ఆశిస్తున్న పలువురు ఢిల్లీలో మకాం వేసి తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మొత్తం ఆరు మంత్రి పదవులకు గాను ఎంత మందిని ఈ సారి నియమిస్తారు. ఎవరెవరికి అవకాశం వస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. *