TSPSC : టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ క్వశ్చన్ పేపర్ లీకేజీ లో సంచలన విషయాలు

TSPSC : టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ క్వశ్చన్ పేపర్ లీకేజీ లో సంచలన విషయాలు

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) నిర్వహించే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంటి దొంగలే లీకేజీకి పాల్పడి ఉంటారన్న అనుమానం నిజమైంది. కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ నుంచి డేటా చోరీ చేసింది ఇంటి దొంగలేనని తేలిపోయింది. టీఎస్‌పీఎస్సీ సెక్రెటరీ పీఏ ప్రవీణ్, టీఎస్ టీఎస్ ఉద్యోగి రాజశేఖర్ కీలక నిందితులని పోలీసుల విచారణలో వెల్లడైంది. 

టీఎస్‌పీఎస్సీ (TSPSC) సెక్రెటరీ పీఏ ప్రవీణ్.. ఓ అమ్మాయి కోసమే పేపర్ లీక్ చేశాడని గుర్తించారు. సదరు యువతి తమ్ముడు పరీక్ష రాస్తుండడంతో ప్రవీణ్ ను ఆమె ప్రశ్నాపత్రం అడిగింది. అడ్మినిస్ట్రేటివ్ సిస్టంపై పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ కు ఇచ్చి... అతని సిస్టంలో లాగిన్ అయ్యారు. ఆ సిస్టంలో ప్రశ్నపత్రాన్ని డౌన్ లోడ్ చేయకుండా నేరుగా ప్రవీణ్ మొబైల్ కు పంపించుకున్నారు. ప్రవీణ్ దాన్ని ఆ యువతికి పంపించాడు. ఆ తర్వాత అమ్మాయి తమ్ముడిని పరీక్షకు ప్రిపేర్ చేశారు. ఈ క్రమంలో ఇదే విషయం యువతి తమ్ముడి ఫ్రెండ్స్ కు తెలిసింది. దాంతో వాళ్లు డబ్బులకు పేపర్ అడిగారు. అప్పుడు మొత్తం 14 లక్షలు మాట్లాడుకుని ...4 లక్షలు యువతి తన వద్దే ఉంచుకుని...మిగతా రూ.10 లక్షలు ప్రవీణ్ కు ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారు. ఆ డీల్ లో డబ్బులు ఇచ్చే దగ్గరే తేడాలు రావడంతో ఓ యువకుడు డయల్ 100 కు కాల్ చేసి ...పేపర్ లీక్ విషయం మొత్తం చెప్పేశాడు. దీంతో అసలు విషయాలన్నీ బయటపడ్డాయి. నిందితుల్లో మహిళ భర్త కూడా ఉన్నాడని తెలుస్తోంది. క్వశ్చన్ పేపర్ ను బహిరంగంగానే కొందరు అమ్ముతుండడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

ప్రస్తుతం పోలీసులు 13మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మార్చి 12వ తేదీన జరగాల్సిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఆరోపణతో పరీక్షను టీఎస్ పీఎస్సీఅధికారులు వాయిదావేశారు. ఈనెల 15, 16వ తేదీల్లో జరిగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎగ్జామ్ ను సైతం వాయిదా వేశారు. 

రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు

టీఎస్‌పీఎస్సీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రవీణ్ వ్యక్తిగత ఫోన్, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ తో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొంతమంది మొబైల్స్ ను స్వాధీనం చేసుకుని.. ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒక నిందితుడి సెల్ ఫోన్ లో యువతుల అసభ్యకర ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు. మార్చి 13వ తేదీ సాయంత్రం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.