
- తిరిగి 25 వేల స్థాయికి నిఫ్టీ
- 395 పాయింట్లు అప్
ముంబై: భారతదేశం, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న అంచనాల కారణంగా మార్కెట్లు గురువారం దూసుకెళ్లాయి. బెంచ్మార్క్ బీఎస్ఈ సెన్సెక్స్ 1,200 పాయింట్లు పెరిగింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఏడు నెలల్లో మొదటిసారిగా 25 వేల మార్కును దాటేసింది. 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 1.48 శాతం పెరిగి ఏడు నెలల గరిష్ట స్థాయి 82,530.74 వద్ద స్థిరపడింది. ఇందులోని 29 కంపెనీల షేర్లు లాభపడ్డాయి. మొదటి అర్ధభాగంలో ఇండెక్స్ రేంజ్లో కదిలింది కానీ బ్యాంకింగ్, ఆటో, ఐటీ చమురు, గ్యాస్ షేర్లలో భారీ లాభాల తర్వాత మధ్యాహ్నం సెషన్లో ఊపందుకుంది.
సెషన్ రెండో భాగంలో సెన్సెక్స్ 1,387.58 పాయింట్లు ఎగిసి 82,718.14 వరకు వెళ్లింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 395.20 పాయింట్లు పెరిగి ఏడు నెలల గరిష్ట స్థాయి 25,062.10 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ గత అక్టోబర్ 15వ తేదీన 25 వేలపైన ముగిసింది. దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గడంతోపాటు మనదేశంతో వాణిజ్య ఒప్పందం గురించి యూఎస్ నుంచి సానుకూల సంకేతాల కారణంగా మార్కెట్ బలంగా పుంజుకుందని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్లో పరిశోధనా విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు. ఆటోమొబైల్స్, రియల్ ఎస్టేట్ వంటి రేట్- సెన్సిటివ్ రంగాలు ర్యాలీకి దోహదపడ్డాయని అన్నారు. భారతదేశం అమెరికన్ వస్తువులపై అన్ని సుంకాలను తగ్గించడానికి ముందుకొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం పేర్కొన్నారు.
సెన్సెక్స్లో ఒకే షేర్కు నష్టం..
సెన్సెక్స్ షేర్లలో, టాటా మోటార్స్ 4 శాతానికి పైగా పెరిగింది. హెచ్సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, మారుతి, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్ లాభాలను ఆర్జించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ షేర్లు కూడా పెరిగాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ మాత్రమే నష్టపోయింది. బీఎస్ఈ స్మాల్క్యాప్ గేజ్ 0.94 శాతం, మిడ్క్యాప్ ఇండెక్స్ 0.67 శాతం పెరగడంతో బ్రాడ్ మార్కెట్లు కూడా లాభపడ్డాయి. అన్ని రంగాల సూచీలు లాభాలతో ముగిశాయి, రియాల్టీ 1.87 శాతం, ఆటో 1.86 శాతం, సేవలు 1.85 శాతం, ఇండస్ట్రియల్1.62 శాతం, మెటల్ 1.60 శాతం, కన్జూమర్ డిస్క్రెషనరీ 1.57 శాతం, కమోడిటీస్ 1.51 శాతం పెరిగాయి.
బీఎస్ఈలో 2,639 స్టాక్లు పుంజుకోగా, 1,325 పడ్డాయి. ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి, జపాన్కు చెందిన నిక్కీ 225 ఇండెక్స్, షాంఘైకి చెందిన ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్కు చెందిన హాంగ్ సెంగ్ నష్టపోయాయి. యూరప్లో మార్కెట్లు మిశ్రమ ధోరణిలో ట్రేడవుతున్నాయి. బుధవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ప్రపంచ చమురు బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 3.65 శాతం తగ్గి 63.68 డాలర్లకు చేరుకుంది. ఎఫ్ఐఐలు బుధవారం రూ.931.80 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు.