- పోలీస్స్టేషన్లలో గన్నులతో హల్చల్
- పార్టీలోనూ వన్ మ్యాన్ షో
- హైకమాండ్కు ఫిర్యాదులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగా ఎమ్మెల్సీ కౌశిక్ అండ్ గ్యాంగ్ తీరు తీవ్ర వివాదాస్పదవుతున్నది. ఆయన అనుచరులు బొడ్లో గన్నులు పెట్టుకొని తిరుగుతున్న ఫొటోలు ఆమధ్య బయటకు వచ్చాయి. అది మరచిపోకముందే హనుమకొండ, దాని చుట్టుపక్కల ఏరియాల్లో కౌశిక్ గ్యాంగ్ చేస్తున్న ల్యాండ్సెటిల్మెంట్లపై రోజుకో కొత్తవిషయం వెలుగుచూస్తోంది. ఇటీవల ఓ పంచాయతీ సెటిల్ మెంట్ కోసమని వచ్చిన కౌశిక్ అనుచరులు ఏకంగా హుజూరాబాద్ ఏసీపీ ఆఫీస్ లో హల్చల్ చేయడం కలకలం రేపింది. ఇది చాలదన్నట్లు ఇటు పార్టీలో, అటు పాలనలో కౌశిక్ వన్మ్యాన్షోపై హైకమాండ్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా కౌశిక్కు సీఎం కేసీఆర్క్లాస్ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
గన్నుల లొల్లి మరవకముందే సెటిల్మెంట్లు..
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే ఐదుగురికి లైసెన్స్డ్వెపన్స్ఉండగా ఇటీవల మరో ఇద్దరికి గన్ లైసెన్స్ ఇచ్చారు. ఆ ఇద్దరూ కౌశిక్ అనుచరులే కావడం గమనార్హం. ఆమధ్య జయశంకర్ జయంతి వేడుకల్లో కౌశిక్ అనుచరుడొకరు అందరికీ కనిపించేలా బొడ్లో గన్పెట్టుకుని వచ్చి షో చేశాడు. దీంతో వారి ఆగడాలు ఒక్కొక్కటే బయటకు వచ్చాయి. పోలీస్స్టేషన్లలోనే టేబుల్పై గన్స్పెట్టి ల్యాండ్, ఇతర సివిల్కేసుల సెటిల్మెంట్లు చేస్తున్న విషయం బయటపడింది. ఇటీవల హుజూరాబాద్కు చెందిన ఓ సీడ్ వ్యాపారికి సంబంధించిన లావాదేవీల విషయంలో కలుగచేసుకొని ఏసీపీ ఎదుటే గన్తో షో చేసి, బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. -కౌశిక్ రెడ్డి వర్గీయులు ఈమధ్యే పరకాల ఏరియాలో ఒక ల్యాండ్ సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అయినట్లు తెలిసింది. ఈ విషయం హైకమాండ్దాకా వెళ్లింది. ఇది మరిచిపోకముందే ఇల్లందకుంట మండలంలో ఓ భార్యాభర్తల గొడవలో తలదూర్చడంతో దుమారం రేగింది. ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ను అడ్డాగా చేసుకొని అక్కడి కౌశిక్ అనుచరుడొకరు చేస్తున్న ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. వీళ్ల టార్చర్ భరించలేక ఇప్పటికే ముగ్గురు ఎంపీడీవోలు ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్లిపోయారు. ప్రస్తుత తహసీల్దార్ కూడా ఇక్కడ పనిచేయలేనని, తనను వేరే చోటుకు ట్రాన్స్ఫర్ చేయాలని కలెక్టర్ను వేడుకున్నట్లు తెలిసింది. కౌశిక్ అనుచరుడు హనుమకొండలోని ఓ ల్యాండ్ ఇష్యూ లో ఎంటర్ కాగా, అక్కడి ఓ ఎమ్మెల్యే అడ్డుకొని హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హనుమకొండ చుట్టుపక్కల గ్రామాల్లో భూముల రేట్లు కోట్లలో పలుకుతుండడంతో కౌశిక్, ఆయన అనుచరులు ల్యాండ్ సెటిల్మెంట్లలో తలదూరుస్తున్నారని, గన్లతో బెదిరిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీస్అధికారులు ఇటీవల ఇద్దరి గన్ లైసెన్స్ లు రద్దు చేశారు. కానీ ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి సాయంతో మరోసారి లైసెన్స్లు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్లో గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో గన్కల్చర్, గూండాగిరీ పెరిగిపోవడంపై సామాన్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది.
ముందు డీజే.. వెనుక పోలీస్ ఎస్కార్ట్
కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీ అయ్యాక హుజూరాబాద్ నియోజకవర్గంలో వన్మ్యాన్షో నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కౌశిక్రెడ్డి మండలాల పర్యటనకు వస్తే ముందు డీజే, అందులో కౌశిక్ పాటలు, వెనుక పోలీస్ఎస్కార్ట్ వాహనం వస్తాయంటే ఆయన ఏ రేంజ్లో హవా కొనసాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బీజేపీకి చెందిన ఈటల రాజేందర్ఎమ్మెల్యేగా ఉండడంతో అక్కడ ఎమ్మెల్సీ చెప్పినదానికే ప్రియారిటీ ఇవ్వాలని సర్కారు పెద్దల నుంచి అటు అధికారులకు, ఇటు పోలీసులకు మౌఖిక ఆదేశాలున్నాయి. దీనిని ఆసరాగా తీసుకొని ఎమ్మెల్సీ, ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారనే టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా అధికారిక కార్యక్రమాలను, టీఆర్ఎస్నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న గెల్లు శ్రీనివాస్కు సంబంధం లేకుండా పార్టీ కార్యకలాపాలను అన్నీ తానై నడిపిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో కౌశిక్, ఆయన అనుచరులు అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకాలు సాగిస్తున్నారని, పార్టీలో సీనియర్ నేతలను కూడా పట్టించుకోవడం లేదని హైకమాండ్కు లోకల్ లీడర్లు ఫిర్యాదు చేసినట్లు చర్చ జరుగుతోంది.