
బషీర్బాగ్, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా పాలకొండ శివారులో భూ వివాదంపై పలువురు బాధితులు సోమవారం రాష్ట్ర డీజీపీ జితేందర్కు ఫిర్యాదు చేశారు. తమ భూమిని అమ్ముకోకుండా కొంత మంది పోలీస్ అధికారుల మద్దతుతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. బాధితులు పాలాది కళావతి, మారే శ్రీనివాస్ గౌడ్ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడుతూ.. మహబూబ్నగర్ అర్బన్ మండలం పరిధిలోని సర్వే నెం. 272/1లో ఉన్న 7.30 ఎకరాల భూమిని తాము కొనుగోలు చేశామన్నారు.
2023 నవంబర్ 3న పసుపుల గోపాలకృష్ణకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని, అయితే జడ్చర్లకు చెందిన శివలింగ, సురేశ్ తమను బెదిరించి 51 ప్లాట్లకు అగ్రిమెంట్ చేయించారని తెలిపారు. అగ్రిమెంట్లో చలువగాలి రాఘవేందర్ రాజు అనే వ్యక్తి పేరు చేర్చారని, మే 14న రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రూ. 30 లక్షల నగదు ఇచ్చినట్లు చెప్పి, మిగిలిన భూమిని కూడా బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయాలంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు.
చలువగాలి రాఘవేందర్ రాజు మహబూబ్నగర్ రూరల్ ఎస్సై విజయ్ కుమార్తో కలిసి దిల్సుఖ్నగర్లోని తమ ఇంటికి వచ్చి ఎలాంటి నోటీసులు లేకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారని ఆరోపించారు. అక్కడ చిత్రహింసలు పెట్టి, అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో బలవంతంగా వేలిముద్ర వేయించారని తెలిపారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించామని, కోర్టు వారికి ముందస్తు బెయిల్ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రాణ భయంతో తమ నివాసం వదిలి వేరే చోట తలదాచుకుంటున్నామని తెలిపారు. తమను వేధించిన ఎస్సై విజయ్ కుమార్, చలువగాలి రాఘవేందర్ రాజు, డ్రైవర్ శివగౌడ్, కానిస్టేబుళ్లు గోపాల్ నాయక్, మహేందర్ పై చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని డీజీపీని కోరారు.