జైపూర్: లైంగిక వేధింపులకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆదేశించారు. ఇలాంటి నేరాలు చేసే వారిని ప్రభుత్వ ఉద్యోగులకు అనర్హులుగా ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని లా అండ్ అర్డర్పై సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంట్లో సీఎం రివ్యూ చేశారు. లైంగిక నేరాలకు పాల్పడే వారికోసం ప్రత్యేకంగా రికార్డు నిర్వహించాలని, వారి క్యారెక్టర్ సర్టిఫికెట్లో చేసిన నేరాన్ని పేర్కొనాలని పోలీసులను సీఎం ఆదేశించారు.
మహిళలు, బలహీన వర్గాలపై నేరాలను నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. ‘‘లైంగిక వేధింపులకు పాల్పడే దుర్మార్గుల రికార్డును మెయిన్ చేయాలి. క్యారెక్టర్ సర్టిఫికేట్లో ఈ విషయం గురించి ప్రస్తావించాలి. తరుచూ ఇలా వేధింపులు చేసే వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక చేయకుండా అడ్డుకోవాలి” అని గెహ్లాట్ పేర్కొన్నారు.
మహిళలు, యువతులు, బాలికలపై లైంగిక దాడికి పాల్పడే యువకుల వివరాలను రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ బోర్డుకు పంపించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి నడిపే బార్లు, నైట్ క్లబ్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
