- నిందితుడి ఫోన్లో 49 వేల మంది ఫొటోలు
- సెక్స్ రాకెట్ కేసులో బయటపడుతున్న నిజాలు
- మరో ఐదుగురు నిందితుల కోసం పోలీసుల సెర్చింగ్
- ఫోన్ డేటా ఆధారంగా కస్టమర్ల వివరాల సేకరణ
గచ్చిబౌలి, వెలుగు: ఇంటర్నేషనల్ స్థాయిలో జరుగుతున్న ఆన్లైన్ సెక్స్ రాకెట్ ముఠాను పట్టుకున్న కేసులో విస్తుపోయే విషయాలు బయటపడ్తున్నాయి. ప్రధాన నిందితుడు అదీమ్ అలియాస్ అర్నవ్(31) వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇతని సెల్ఫోన్లో 49,900 మంది యువతుల ఫొటోలు, వాళ్ల వివరాలు ఉన్నాయని చెప్పారు.
ఈ యువతులందరినీ వ్యభిచారం కోసమే సంప్రదించేవాడని పోలీసులు బుధవారం మీడియాకు వెల్లడించారు. అదీమ్తో పాటు మిగిలిన నిందితుల ఫోన్లలోనూ వేలాది మంది యువతుల ఫోటోలను గుర్తించారు.ఇంత పెద్ద సెక్స్ రాకెట్ నడుపుతున్న అదీమ్ను, మరో 18 మంది నిందితులను పోలీసులు మంగళవారమే అరెస్ట్ చేశారు. వీరందరినీ తమ కస్టడీకి తీసుకుని, దీనివెనుక ఇంకెవరెవరు ఉన్నారనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సెక్స్ రాకెట్ ముఠాలో మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలియజేశారు. వాళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల కమిషనర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ముఠా ఆర్గనైజర్లు వాడిన వెబ్సైట్లను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు అరెస్ట్ చేసిన 17 మంది నిందితుల మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా విటుల వివరాలను కూడా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
4 ఏండ్లుగా పోలీసుల కండ్లుగప్పి..
ఈ కేసులో ప్రధాన నిందితుడు అదీమ్ 4 ఏండ్లుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. 2019 నుంచి అడ్రస్లు మారుస్తూ వస్తున్నాడు. ఏదైనా డెలివరీ వస్తే తాను అడ్రస్ చేంజ్ అయ్యాను అంటూ పలానా ప్లేస్కు రావాలని చెప్పి డెలివరీ తీసుకుంటాడు. హైదరాబాద్ కేంద్రంగా సెక్స్ రాకెట్ నడుపుతున్న అదీమ్పై హైదరాబాద్, సైబరాబాద్ లిమిట్స్లోని 5 పోలీస్ స్టేషన్లలో 10 కేసులున్నాయి. రెండు నెలల నుంచి సైబరాబాద్ పరిధిలోని వ్యభిచార గృహాలపై దాడులు చేస్తున్న పోలీసులు నిర్వాహకుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అదీమ్ను అరెస్ట్ చేశారు.