బషీర్బాగ్, వెలుగు: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, బడ్జెట్లో విద్యకు 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వేర్వేరుగా అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 15 శాతం నిధులు ఇస్తామని హామీ ఇచ్చి, బడ్జెట్లో కేవలం 8 శాతం మాత్రమే కేటాయించడం విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడమేనని నేతలు మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న రూ. 9,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే విద్య భరోసా కార్డులు, ఎలక్ట్రిక్ స్కూటీలు, ల్యాప్టాప్ల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనగా అసెంబ్లీ వైపు వెళ్తున్న విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
