
టాలీవుడ్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. ఇందులో శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రం బృందం ప్రకటించింది. ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
గతేడాది నవంబర్ లోనే విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినా తర్వాత వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. కానీ, చాన్నాళ్ల నుంచి విడుదల తేదీ గురించి సమాచారం లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. అయితే, కొత్త ఏడాది సందర్భంగా ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేశారు. అయితే సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు బరిలో ఉండటంతో మేకర్స్ ఫిబ్రవరి 17వ తేదీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
హృదయానికి హత్తుకునే కథతో పాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటించారు. సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, డా.ఎం.మోహన్ బాబు, ప్రకరాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించటం ప్రధాన ఆకర్షణ కానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది.