
టాలీవుడ్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. ఇందులో శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. గణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘‘మాయ ప్రేమను మరిపిస్తుందేమో.. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు’’ అని సమంత చెప్పిన డైలాగ్స్ అకట్టుకుంటాయి. ట్రైలర్ చూస్తుంటే.. విజువల్ వండర్ గా తెరకెక్కిన ప్రేమ కావ్యంగా కనిపిస్తోంది. ఒక వైపు అడవిలో శకుంతల ఆశ్రమవాసం.. మరో వైపు రాజ్యంలో దుష్యంతుడి రాజరికం. ఇద్దరి పరిచయం.. ప్రేమ.. వివాహం.. విరహం .. దుర్వాసుడి శాపం.. భరతుడి జననం వరకూ ఈ ట్రైలర్ లో చూపించారు. అద్భుతమైన విజువల్స్ తో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాతో, మలయాళ నటుడు దేవ్ మోహన్ పరిచయమవుతున్నాడు. ఇతర ముఖ్యమైన పాత్రలలో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి నటించారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని గుణశేఖర్ చెబుతున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.