మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా కంటిన్యూ అవుతోంది. పార్టీలన్నీ సొంత వ్యూహాలతో ముందుకు పోతుండటంతో రోజుకో మలుపు తిరుగుతోంది. తన కామెంట్లతో శివసేనకు కాక పుట్టిస్తున్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.. ఇవాళ ప్రధాని మోడీని కలవబోతున్నారు. పార్లమెంట్ దగ్గర ప్రధానిని పవార్ కలుస్తారని ఎన్సీత నేత నవాబ్ మాలిక్ చెప్పారు. మహారాష్ట్ర రైతు సమస్యలపైనే మోడీతో చర్చిస్తారని చెప్పారు. మహారాష్ట్రకు కేంద్రం సాయం చేయాలని కోరుతామని చెప్పారు. అయితే మహారాష్ట్ర రాజకీయల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో ప్రధానితో శరద్ పవార్ సమావేశం అవుతుండటం ఆసక్తిగా మారింది. మహారాష్ట్ర రాజకీయాలపైనా ప్రధానితో శరద్ పవార్ చర్చిస్తారనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు సమావేశం కానున్నారు. భేటీ నిన్ననే జరగాల్సి ఉండగా.. కాంగ్రెస్ నేతలు అందుబాటులో లేకపోవడంతో ఇవాళ్టికి వాయిదా పడింది. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ , ఎన్సీపీ నుంచి ప్రపుల్ పటేల్, అజిత్ పవార్, జయంట్ పాటిల్ చర్చల్లో పాల్గొననున్నారు. శివసేనతో కలిసి సర్కార్ ఏర్పాటు చేస్తే కూటమికి పెట్టాల్సిన పేరు, పదవుల పంపకం వంటి అంశాలపై చర్చించనున్నారు. సమావేశంలో కామన్ మినిమం ప్రోగ్రామ్ ఫైనల్ డ్రాఫ్ట్ ను లీడర్లు సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత శివసేనతో చర్చలపై నిర్ణయం తీసుకోనున్నాయి కాంగ్రెస్-NCP.
దేశ ప్రధానిని ఎవరైనా కలవొచ్చు: శివసేన నేత రౌత్
నరేంద్ర మోడీతో శరద్ పవార్ సమావేశంపై స్పందించారు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్. దేశ ప్రధానిని ఎవరైనా కలవొచ్చని చెప్పారు. మహారాష్ట్ర రైతుల కోసమే ప్రధాని మోడీతో శరద్ పవార్ సమావేశం అవుతున్నారని చెప్పారు. రైతులకు కేంద్రం నుంచి మరింత సాయం కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపారు రౌత్.