
ముంబై: పరుపుల తయారీ రంగంలోని షీలా ఫోమ్ లిమిటెడ్ మరో పరుపుల తయారీ కంపెనీ కుర్లోన్ ఎంటర్ప్రైజస్ లిమిటెడ్ను కొనుగోలు చేయనుంది. రూ. 3,250 కోట్ల నగదు చెల్లింపుతో కుర్లోన్ ఎంటర్ప్రైజస్లో నూరు శాతం వాటా చేజిక్కించుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండు నెలల్లో ఈ డీల్ పూర్తవుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి. తాజా డీల్ వల్ల పరుపుల మార్కెట్లో షీలా ఫోమ్ వాటా డబులై 35–40 శాతానికి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు.
స్లీప్వెల్, ఫెదర్ ఫోమ్, ప్యూర్ పీయూ ఫోమ్, లామిఫ్లెక్స్ వంటి బ్రాండ్ పేర్లతో షీలా ఫోమ్ తన ప్రొడక్టులను అమ్ముతోంది. ఈ కంపెనీకి నార్త్, వెస్ట్ ప్రాంతాలలో గట్టి పట్టుండగా, కుర్లోన్ ఎంటర్ప్రైజస్కు సౌత్, ఈస్ట్ ప్రాంతాలలో అమ్మకాలు ఎక్కువగా ఉంటున్నాయి. దేశంలోని మోడర్న్ మ్యాట్రెసెస్ మార్కెట్లో 40 శాతం వాటా మాత్రమే బ్రాండెడ్ ప్లేయర్ల చేతిలో ఉంది.