
న్యూఢిల్లీ, వెలుగు : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై బాధితురాలు షేజల్ దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఢిల్లీ తెలంగాణ భవన్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్యెల్యేకు వ్యతిరేకంగా వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. తమకు న్యాయం జరిగే వరకు జంతర్ మంతర్లో ధర్నా చేస్తామన్నారు. తనలాగే ఎంతో మంది బాధితులున్నారని, వారందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. ‘‘ఎమ్యెల్యే చిన్నయ్య, అతని అనుచరులతో నాకు ప్రాణహాని ఉంది. ఈ వ్యవహారంలో జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశా. ఎమ్మెల్యే నన్ను లైంగింకంగా వేధించారు. ఆయన మనుషులు చంపేస్తామని బెదిరించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆరిజిన్ సంస్థను బెల్లంపల్లిలో స్థాపించాం. ఈ కంపెనీ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలకు వాటా కూడా ఇచ్చాం. ఈ కంపెనీ భూమి వ్యవహారంలో మమ్మల్ని మోసం చేసింది. అంతేకాకుండా తనకు అమ్మాయిలను పంపాలని ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేశారు” అని షేజల్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గోడును చెప్పుకునేందుకు మంత్రి కేటీఆర్ అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వడం లేదని వాపోయారు.