
- 2014లో ఆయా కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వం
- పదేండ్లుగా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వని ఆఫీసర్లు
- ఉన్నత చదువులు, స్కాలర్షిప్స్కు దూరమవుతున్న స్టూడెంట్స్
- సీఎం రేవంత్కు సంఘం నేతల వినతి
- వచ్చే నెలలో ఈ అంశంపై బీసీ కమిషన్ పబ్లిక్ హియరింగ్
హైదరాబాద్, వెలుగు : ఏపీ నుంచి వలస వచ్చి తెలంగాణలో స్థిరపడ్డారన్న కారణంతో గత ప్రభుత్వం బీసీ జాబితాలోంచి తొలగించిన తమను తిరిగి బీసీల్లో కలపాలని 26 కులాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక ఆయా కులాలను 2014 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం బీసీ జాబితాలోంచి తొలగించింది. నాటి నుంచి ఆయా కులాలకు అధికారులు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో తాము ప్రభుత్వ స్కీమ్లకు దూరమవుతున్నామని, తమ పిల్లలు స్కాలర్షిప్లు, ఇతర ప్రయోజనాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయా కుల సంఘాల నాయకులు సీఎం రేవంత్రెడ్డిని, పలువురు మంత్రులను కలిసి తమను తిరిగి బీసీల్లో చేర్చాలని విన్నవించారు. ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేశాక కమిషన్ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయా కులాల అభ్యర్థనలపై బీసీ కమిషన్ ప్రాసెస్ ప్రారంభించింది. కాగా రాష్ట్రంలో ఈ 26 కులాలకు చెందిన జనాభా 10 లక్షల దాకా ఉంటుందని సంఘం నేతలు చెప్తున్నారు.
వచ్చే నెలలో పబ్లిక్ హియరింగ్..
బీసీ కమిషన్ జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించినపుడు 26 కులాల ప్రతినిధులు పాల్గొని, తమను బీసీల్లో చేర్చాలని కోరారు. మరోసారి వచ్చే నెల 9, 10, 11 తేదీల్లో ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు ఈ 26 సంఘాల ప్రతినిధులు మరోసారి తమ వాదనలు వినిపించేందుకు బీసీ కమిషన్ అవకాశం కల్పించింది. ఈ మేరకు పబ్లిక్ హియరింగ్ నోటీసు జారీ చేసింది. ఈ హియరింగ్కు రాలేని వాళ్లు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 13 వరకు కమిషన్కు తమ అభిప్రాయాలను పోస్ట్లో కూడా అందజేయవచ్చని స్పష్టం చేసింది.
మొత్తం 138 కులాలు..
ఏపీ విభజనకు ముందు (జూన్2 నాటికి) బీసీ జాబితాలో మొత్తం 138 కులాలు ఉన్నాయి. 2014 ఆగస్టులో ఈ లిస్ట్ నుంచి శెట్టిబలిజ, బండారా, కొచ్చ, కలింగ, కురాకుల, పొందర, సామంతుల, అసాదులు, అచ్చుకుంట్లవాండ్లు, నాగవడ్డీలు, కుంచటి, గుడియా, అగరు, అతగార, గవర, గొడబ, జక్కల, కండ్ర, కొప్పుల వెలమ, నాగవసం, పొలినాటి వెలమ, తూర్పు కాపు లేదా గాజుల కాపు, సదర, అరవ, బైరి వైశ్య, అతిరస కులాలను ప్రభుత్వం తొలగించింది. అప్పటి నుంచి సీఎంను, మంత్రులను, రెండు సార్లు బీసీ కమిషన్ను కలిసినా తమకు న్యాయం దక్కలేదని 26 కులాల ప్రతినిధులు వాపోతున్నారు.
అన్యాయంగా తొలగించారు
ఏపీ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నామన్న కారణంతో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారు. ఇందుకు ఎలాంటి సహేతుకమైన కారణాలు చూపలేదు. 11 ఏండ్లుగా మాకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. అప్పటి నుంచి మా పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్రంలో 26 కులాలకు సంబంధించి 10 లక్షల జనాభా ఉంటుంది. కనీసం ఓబీసీ సర్టిఫికెట్ ఇవ్వమన్నా.. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్రెడ్డిని కలిసి సమస్యను వివరించాం. న్యాయం చేస్తామని, తిరిగి బీసీ జాబితాలో కలుపుతామని హామీ ఇచ్చారు. బీసీ కమిషన్ ఏర్పాటు తర్వాత మా వినతులను కమిషన్కు పంపారు.- మార్కండేయ, శెట్టిబలిజ సంఘం నేత