వారణాసి సెట్‌‌కు వస్తా.. కొన్ని సీన్స్‌‌ తీస్తా..

వారణాసి సెట్‌‌కు వస్తా.. కొన్ని సీన్స్‌‌ తీస్తా..

మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రం సెట్స్‌‌కు వచ్చి షూటింగ్‌‌ చూడొచ్చా అని దర్శకుడు రాజమౌళిని హాలీవుడ్ డైరెక్టర్‌‌‌‌ జేమ్స్‌‌ కామెరూన్‌‌ కోరారు. ఆయన తెరకెక్కించిన ‘అవతార్‌‌‌‌’ ఫ్రాంచైజీలోని మూడో భాగం ‘అవతార్‌‌‌‌: ఫైర్‌‌‌‌ అండ్‌‌ యాష్‌‌’ ఈనెల 19న  ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళితో పాటు కొందరు సినీ ప్రముఖులకు ఈ చిత్రాన్ని చూపించారు. 

అనంతరం వీడియో కాల్‌‌ ద్వారా స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ‘ఈ సినిమా చూస్తూ థియేటర్‌‌‌‌లో చిన్న పిల్లాడిని అయిపోయానని, అవతార్‌‌‌‌ ఫ్రాంచైజీ సిల్వర్‌‌‌‌ స్క్రీన్‌‌కు బెంచ్‌‌మార్క్ అవుతుందని ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ షూటింగ్ అప్‌‌డేట్స్‌‌ను జేమ్స్‌‌ కామెరూన్ అడిగి తెలుసుకున్నారు. 

ఏడాదిగా షూట్ జరుగుతోందని,  మరో ఏడెనిమిది నెలలు షూటింగ్ ఉంటుందని రాజమౌళి చెప్పారు. ‘వారణాసి సెట్స్‌‌ చూడాలని ఉందని,  చూడొచ్చా అని కామెరూన్ అడిగారు. మీరు వస్తే మూవీ టీమ్‌‌తో పాటు సినిమా ఇండస్ట్రీ అంతా థ్రిల్ అవుతుందని రాజమౌళి సంబురంగా చెప్పారు.  పులులతో ఏదైనా షూట్ ప్లాన్ చేస్తే చెప్పమని, సెకండ్ యూనిట్‌‌కైనా కెమెరా పట్టుకుని కొన్ని సీన్స్‌‌ తీస్తానని కామెరూన్‌‌ అనడం రాజమౌళి మేకింగ్ పట్ల ఆయనకున్న ఆసక్తిని తెలియజేసింది.