చిట్ ఫండ్ పేరుతో ప్రముఖులను మోసం చేసి కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన కేసులో అరెస్టయి పోలీస్ కస్టడీలో ఉన్న శిల్పా చౌదరిని...నార్సింగ్ పోలీసులు రెండు రోజు(ఇవాళ) ప్రశ్నించారు. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి లాకర్లు తెరిపించిన పోలీసులు అందులోంచి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తానెవరినీ మోసం చేయలేదని, బ్లాక్ మనీని వైట్ మనీ చేయమని కొందరు తనకు డబ్బులిచ్చారని శిల్పా చౌదరి చెప్పినట్టు సమాచారం. తనకు కొందరు డబ్బు అప్పుగా ఇచ్చారని ఆ డబ్బుని సినిమాహాళ్లు, ఆస్పత్రుల్లో పెట్టుబడులు పెట్టినట్లు శిల్పా చౌదరి చెప్పింది. తన దగ్గర అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వలేదని అందుకే తాను చెల్లించాల్సిన వారికి సకాలంలో ఇవ్వలేకపోయానని శిల్పా చెప్పినట్లు సమాచారం.
గండిపేట సిగ్నేచర్ విల్లాస్ లో ఉంటున్న శిల్పాచౌదరి దంపతులు కిట్టీ పార్టీలతో ప్రముఖ కుటుంబాలకు చెందిన మహిళలతో స్నేహం చేశారు.బిల్డింగ్ నిర్మాణాలు, రియల్ ఎస్టేట్, సినీ బిజినెస్ లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని నమ్మించి ..కోట్లాది వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
శిల్పా చౌదరి రెండు రోజుల పోలీసు కస్టడీ ఈ రోజుతో ముగియనుండటంతో సాయంత్రం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు.