
సావర్కర్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై ఫైర్
జనం బుద్దిచెప్పినా కాంగ్రెస్, ఎన్సీపీ మారట్లేదని విసుర్లు
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోడీ
సతారా, పార్లీ, పుణె(మహారాష్ట్ర): ఎన్డీఏ ప్రభుత్వాలకు నేషనలిజం, నేషనల్ సెక్యూరిటీ అంశాలే ఫస్ట్ ప్రయారిటీ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఈ విషయంలో తాము ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుంటామని, అదే స్ఫూర్తితో దేశ ఐక్యతను దెబ్బతీసేవాళ్లకు గట్టిగా బుద్ధిచెబుతామని అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన మూడు చోట్ల బహిరంగ సభల్లో మాట్లాడారు. మహారాష్ట్రలోని సతార్ ‘గురు భూమి’అని, తన గురువు లక్ష్మణ్ ఇనాందార్ ఈ ప్రాంతానికి చెందినవారేనని ప్రధాని గుర్తు చేసుకున్నారు.‘‘ఐదేండ్లుగా కేంద్రం, మహారాష్ట్రలోని ఎన్డీఏ ప్రభుత్వాలు శివాజీ నెలకొల్పిన విలువల్ని పాటిస్తూవచ్చాయి. ఆయనను అనుసరిస్తూ, దేశ సమైక్యతకోసం మేం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలతో వాళ్లింకా గుణపాఠం నేర్చుకున్నట్లు లేరు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలే ఆ పార్టీలకు బుద్ధి చెబుతారు”అని మోడీ అన్నారు.
వీరుల్ని అవమానిస్తారా
దేశం కోసం ఎన్డీఏ తీసుకుంటోన్న నిర్ణయాలపై తప్పుడు ప్రచారం చేస్తోన్న ప్రతిపక్షాలు తద్వారా వీరుల్ని కూడా అవమానిస్తున్నాయని మోడీ ఆరోపించారు. ‘‘అప్పట్లో రాఫెల్ డీల్పై ఫాల్స్ ప్రాపగండా చేశారు. ఈమధ్య ఆర్టికల్ 370 రద్దుపై అడ్డగోలుగా మాట్లాడి సైనిక కుటుంబాల గుండెల్ని గాయపర్చారు. వీలుచిక్కినప్పుడల్లా వీర్సావర్కర్ లాంటి వీరులపైనా విషం కక్కారు”అని ప్రధాని విమర్శించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిలో కుర్చీల కోసం కొట్లాట జరుగుతోందని, గాలి ఎటు వీస్తుందో గుర్తించారు కాబట్టే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ లోక్సభ ఎన్నికల్లో పోటీచేయలేదని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు రిపీట్ అవుతాయని మోడీ చెప్పారు.
దేశచరిత్రను తిరగరాయాలి: అమిత్ షా
వారణాసి: హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ పేరును భారతరత్న అవార్డుకు మరోసారి ప్రతిపాదించడంపై ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గట్టిగా కౌంటరిచ్చారు. సావర్కర్ కృషి వల్లే దేశ స్వాతంత్ర్య పోరాటంలో తొలి సంగ్రామమైన ‘1857 సిపాయిల తిరుగుబాటు’ వెలుగులోకి వచ్చిందని, సావర్కరే లేకుంటే 1857 తిరుగుబాటును మనం ఇప్పటికీ బ్రిటిషర్ల యాంగిల్లోనే చూసుండేవాళ్లమని, అదొక చరిత్రగా రికార్డయ్యేది కాదని షా తెలిపారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో గురువారం జరిగిన సెమినార్లో మాట్లాడిన ఆయన.. చరిత్ర మొత్తాన్ని ఇండియా కోణంలో తిరగరాయాల్సిన అవసరం ఉందన్నారు. పండిట్ మదన్ మోహన్ మాలవీయ స్థాపించిన బెనారస్ వర్సిటీ హిందూ కల్చర్ని కాపాడటానికి కృషిచేస్తోన్నదని షా కొనియాడారు.