- అందుకే సోనియా రాజ్యసభకు వెళ్లారు
- ఎప్పుడు ఏం చేయాలో తెలియని కెప్టెన్ రాహుల్ అని విమర్శ
భోపాల్: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా దయనీయంగా ఉందని.. చివరకు సోనియా గాంధీ కూడా లోక్సభకు పోటీచేయకుండా రాజ్యసభ ద్వారా పార్లమెంటుకు వెళ్లారని.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం భోపాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిర్ణయాధికారం గందరగోళంగా ఉందని.. లోక్సభ ఎన్నికల్లో పోటీలో నిలిపేందకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే దొరకడం లేదన్నారు. ‘‘రాహుల్ గాంధీ ఎప్పుడు ఏం చేయాలో తెలియని కెప్టెన్. ఎన్నికలకు రెడీ అవుతున్నప్పుడు యాత్రలకు వెళ్తడు.
యాత్రలు చేయవలసిన టైమ్లో విదేశాలకు వెళ్తడు. ఓటమి తర్వాత ఈవీఎంల గురించి అరుస్తడు” అని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ దయనీయ పరిస్థితిని చూసి ముందుజాగ్రత్త కలిగిన నేతలు ఆ పార్టీని వీడుతున్నారని చెప్పారు. వరుస ఓటములు చూసి సోనియా గాంధీ కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించి బ్యాక్డోర్లో రాజ్యసభ నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టేంత దారుణంగా ఆ పార్టీ తయారైందని అన్నారు. తాను విదిశ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
