GVLకు షాక్ : ప్రెస్ మీట్ లో ఉండగా షూ తో దాడి

GVLకు షాక్ : ప్రెస్ మీట్ లో ఉండగా షూ తో దాడి

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ GVL నరసింహారావుకు పరాభవం ఎదురైంది. ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా.. ఆయనపైకి షూ విసిరాడు ఓ వ్యక్తి. సాధ్వి ప్రజ్ఞ్యాను భోపాల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపడంపై జీవీఎల్ మాట్లాడుతున్న టైమ్ లో ఈ సంఘటన జరిగింది. పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి… ప్రెస్ మీట్ ఆడియన్స్ నుంచి సడెన్ గా లేచి… జీవీఎల్ పైకి షూ విసిరాడు. ఆ షూ జీవీఎల్ పై పడలేదు. ఆయన మాట్లాడుతున్న మైక్ ను తగిలి పక్కకు వెళ్లింది. ఈ సంఘటనతో జీవీఎల్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయన పక్కనే ప్రెస్ మీట్ లో బీజేపీ జనరల్ సెక్రటరీ భూపేందర్ యాదవ్ కూడా అక్కడే ఉన్నారు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది షూ విసిరిన వ్యక్తిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్ నుంచి బయటకు బలవంతంగా తీసుకెళ్లారు. 

కాంగ్రెస్ నేతలు దేన్నీ సహించడం లేదనీ.. ఈ సంఘటన వారు అప్రజాస్వామిక పద్ధతులను మరోసారి రుజువు చేసిందని జీవీఎల్ అన్నారు. ఇలాంటి దాడులతో తాము భయపడేది లేదని ఆయన అన్నారు. ప్రెస్ మీట్ ను మధ్యలోనే ముగించి వెళ్లిపోయారు. దాడి చేసిన వ్యక్తి శక్తి భార్గవ్ అని అంటున్నారు. ఆయన గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.