- ట్రాక్టర్ నడుపుతూ కరోనా పేషెంట్ డెడ్ బాడీని శ్మశానానికి చేర్చిన డాక్టర్ శ్రీరామ్ కు షోకాజ్
- డ్రైవర్ రావడం లేటవుతుందనే తీసుకెళ్లినట్లు ఆయనతో వివరణ
- దేశమంతా డాక్టర్ సేవకు ప్రశంసలు.. ఇక్కడేమో చీవాట్లు
- ఆయన చొరవ స్ఫూర్తిదాయకమన్న ఉపరాష్ట్ర పతి
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి డెడ్బాడీని ట్రాక్టర్లో వేసుకొని స్వయంగా నడుపుకుంటూ శ్మశానవాటికకు తీసుకెళ్లిన డాక్టర్ శ్రీరామ్పై రాష్ట్ర సర్కార్కు కోపమొచ్చింది. డెడ్బాడీ తరలింపులో ఐసీఎంఆర్ గైడ్లెన్స్ పాటించలేదని ఆరోపిస్తూ.. డాక్టర్ అయి ఉండి మృతదేహాన్ని ఎందుకు తరలించాల్సి వచ్చిందో చెప్పాలంటూ ఆయనకు జిల్లా ఆఫీసర్లు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. దీనికి డాక్టర్ శ్రీరామ్ రాతపూర్వకంగా సంజాయిషీ లెటర్ ఇవ్వాల్సి వచ్చింది. డ్రైవర్ రావడం లేటవుతుందనే తీసుకెళ్లాను తప్ప మరో ఉద్దేశం లేదంటూ ఆయనతో వివరణ తీసుకున్నారు. అన్ని శాఖల నడుమ కో ఆర్డినేషన్ ఉందంటూ డాక్టర్ పేరుతో ఏకంగా ప్రెస్నోట్ కూడా రిలీజ్ చేయించారు. డెడ్బాడీని ట్రాక్టర్లో వేసుకొని స్వయంగా నడుపుకుంటూ శ్మశానానికి చేర్చిన డాక్టర్ శ్రీరామ్ సేవను దేశమంతా మెచ్చుకుంటుండగా.. సర్కారు మాత్రం షోకాజ్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
శభాష్ అంటూ మెచ్చుకున్న వైస్ ప్రెసిడెంట్
న్యూఢిల్లీ,వెలుగు: కరోనా పేషెంట్ డెడ్బాడీని ట్రాక్టర్లో వేసుకొని తానే డ్రైవ్ చేసుకుంటూ శ్మశానవాటికకు తీసుకెళ్లిన డాక్టర్ శ్రీరామ్ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ‘‘కరోనా మృతుడి భౌతికకాయం తరలింపునకు మున్సిపాలిటీ డ్రైవర్ నిరాకరించడంతో స్వయంగా తానే ట్రాక్టర్ నడిపి శ్మశానవాటికకు తీసుకెళ్లిన పెద్దపల్లి జిల్లా కరోనా నిఘా అధికారి డాక్టర్ పెండ్యాల శ్రీరామ్ గారి చొరవను అభినందిస్తున్నాను. వీరి చొరవ, అంకితభావం సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలి” అని ఉప రాష్ట్రపతి మంగళవారం ట్వీట్ చేశారు.
ట్రాక్టర్ నడిపిన డాక్టర్కు..షోకాజ్ నోటీసు ఇచ్చిన సర్కారు
మున్సిపల్ శాఖకు చెడ్డ పేరు వచ్చిందట!
శ్రీరామ్ పని వల్ల మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ శాఖకు చెడ్డ పేరొచ్చిందట. అందుకే సీనియర్ ఆఫీసర్ల ఆదేశాల మేరకు జిల్లా ఆఫీసర్లు సంజాయిషీ లెటర్ తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. అంతేకాకుండా శ్రీరాం ద్వారా సోమవారం రాత్రి పత్రికా ప్రకటన కూడా విడుదల చేయించారు. పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో మార్చురీ అంబులెన్స్ అందుబాటులో లేకే ట్రాక్టర్ వాడామని, డెడ్బాడీ తరలింపులో శాఖల మధ్య ఎలాంటి కో ఆర్డినేషన్ లోపం లేదని ప్రకటనలో డాక్టర్ శ్రీరామ్ పేర్కొన్నారు. ‘‘డ్రైవర్ రావడానికి కొంత టైం పడుతుందని, అప్పటివరకు కరోనా పెషెంట్ డెడ్బాడీ తరలించకపోతే ఇతరులకు ఇబ్బం ది కలుగుతుందనే ఉద్దేశంతోనే నేనే స్వయంగా ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ శ్మశానవాటికకు తీసుకెళ్లాను. కరోనా డెడ్బాడీల తరలింపులో సమాజంలో ఉన్న కొన్ని అపోహలను కూడా తొలగించాలని కూడా భావించాను. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, మున్సిపల్శాఖ అధికారులు కో ఆర్డినేషన్తో పని చేస్తున్నారు’’ అని ఆయన వివరించారు.