ప్రమాణ స్వీకారానికి రండి.. ఖర్గే, గాంధీ ఫ్యామిలీని కోరిన సిద్ధరామయ్య, డీకే

ప్రమాణ స్వీకారానికి రండి.. ఖర్గే, గాంధీ ఫ్యామిలీని కోరిన సిద్ధరామయ్య, డీకే

న్యూఢిల్లీ: కర్నాటక సీఎంగా, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. కేబినెట్​లో ఎవరికి అవకాశం కల్పించాలన్న అంశంపై పార్టీ హైకమాండ్​తో చర్చలు జరిపారు. ఎవరికి ఏ శాఖ ఇస్తే బాగుంటుందన్న దానిపై కూడా మాట్లాడుకున్నారు. శనివారం నిర్వహించనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా పార్టీ పెద్దలను సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కోరారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12:30 గంటలకు సిద్ధు, డీకే శివకుమార్​తో పాటు పలువురు సభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీని ఆహ్వానించేందుకు ఢిల్లీకొచ్చాం. మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చిస్తాం” అని డీకే చెప్పారు.

ప్రజా సంక్షేమమే ముఖ్యం

‘‘ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎవరిని ఆహ్వానించాలనేది ఏఐసీసీ అధ్యక్షుడు చూసుకుంటారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్​తో పాటు గాంధీ ఫ్యామిలీని ఇన్వైట్ చేసేందుకే మేము వచ్చాం”అని డీకే వివరించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్​గాంధీ, ప్రియాంకా గాంధీ ఇచ్చిన హామీల అమలుకు కేబినెట్ ఫస్ట్ మీటింగ్​లోనే ఆమోదం తెలుపుతామన్నారు.

34 మందితో కేబినెట్​ఏర్పాటు

34 మందితో కేబినెట్ ఏర్పాటు చేస్తున్నామని డీకే వివరించారు. నేషనల్ లీడర్స్ అందరూ ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తున్నారని, ఫస్ట్​ కేబినెట్​లో ఐదు గ్యారెంటీ స్కీమ్ అమలుకు నిర్ణయం తీసుకుంటామని వివరించారు. బీజేపీ, జేడీఎస్ లీడర్లను ఇన్వైట్ చేశామని, వారు కూడా ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నవారే అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతిపక్ష పార్టీల సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. ఢిల్లీకి బయలుదేరే ముందు కంఠీరవ స్టేడియానికి వెళ్లిన డీకే శివకుమార్.. 
అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.