అధికార పార్టీ నేతలకే సెక్యూరిటీ పెంచుతరా?
- గతంలో తనకు సెక్యూరిటీ పెంచాలని అడిగినా పట్టించుకోలేదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికల కోడ్అమలవుతుందా? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ వాళ్లు ర్యాలీలు, ఆందోళనలు చేశారని.. కోడ్ అమల్లో ఉంటే వాటికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై సిద్దిపేట పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, గతంలోనూ తాము కంప్లయింట్లు ఇచ్చినా స్పందించలేదని ఫైర్ అయ్యారు. సీపీ అధికార పార్టీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కండువా ఉంటేనే పోలీసులు రక్షణ ఇస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం బీఆర్కే భవన్లో సీఈవో వికాస్రాజ్ను రఘునందన్రావు కలిశారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్కమిషనర్పై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడి విషయంలో సీపీ స్టేట్మెంట్తో తమ పార్టీ కార్యకర్తలపై బీఆర్ఎస్ నేతలు దాడులకు దిగుతున్నారని చెప్పారు. గత నెల 13న కూడా సిద్దిపేట పోలీసుల తీరుపై సీఈసీకి కంప్లయింట్ చేసినట్టు గుర్తు చేశారు.
చేసింది కాంగ్రెస్ అయితే.. మా మీద దాడులా?
‘‘ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై అటాక్ చేసిన రాజు కాంగ్రెస్ కార్యకర్త అయితే, మా మీద ఎందుకు దాడులు చేస్తున్నారు” అని రఘునందన్ ప్రశ్నించారు. ఎలక్షన్ కోడ్ లో భాగంగా సెక్షన్ 30 యాక్ట్ కొందరికేనా? లేక అందరికా? స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘‘బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ క్యాండిడేట్లకు భద్రత పెంచాలని ఆదేశాలు ఇచ్చారు. 2+2 నుంచి 4+4కు సెక్యూరిటీ పెంచాలని అన్ని జిల్లాల ఎస్పీలకు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ నుంచి ఆదేశాలు అందాయి. గతంలో నాకు సెక్యూరిటీ పెంచాలని డీజీపీని కలిస్తే పట్టించుకోలేదు. కేవలం అధికార పార్టీ నేతలకే సెక్యూరిటీ పెంచుతరా? ప్రతిపక్ష నేతలను పట్టించుకోరా” అని ప్రశ్నించారు.