మరికొన్ని గంటల్లో పరివర్తన ఏకాదశి : విష్ణుమూర్తిని పూజిస్తే పెండింగ్ పనులు పూర్తవుతాయి..!

మరికొన్ని గంటల్లో పరివర్తన ఏకాదశి : విష్ణుమూర్తిని పూజిస్తే  పెండింగ్ పనులు పూర్తవుతాయి..!

హిందూ పంచాగం ప్రకారం.. బాధ్రపదమాసం కొనసాగుతుంది.  ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి.. ప్రతి ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. బాధ్రపదమాసం శుక్ష పక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన  ఏకాదశి అంటారు.  ఈ ఏడాది ( 2025) సెప్టెంబర్​ 3 బుధవారం రోజున పరివర్తన ఏకాదశి వచ్చింది.  ఆరోజు  విశిష్టత ఏంటి.. ఆరోజు ఏంచేయాలి.. ఏం చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . 

 ఆషాఢ శుద్ధ ఏకాదశి  రోజున శేష శయ్యపై యోగ నిద్రలోకి వెళ్లిన  శ్రీమహావిష్ణువు....భాద్రపద శుద్ధ  ఏకాదశి ( సెప్టెంబర్ 3) రోజున ఎడమ వైపు నుంచి కుడి వైపుకి  ఒత్తిగిల్లుతాడట. అలా స్వామి ఒక వైపు నుంచి మరో వైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక, దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు.   
 
పరివర్తిని ఏకాదశి సెప్టెంబర్ 3 న జరుపుకుంటారు. ఈ ఏకాదశి తిథి సెప్టెంబర్ 3న తెల్లవారుజామున 03:53 గంటలకు ప్రారంభమై...  సెప్టెంబర్ 4  ఉదయం 04:21 గంటలకు ముగుస్తుంది.    పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ  ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను పూజించి ... ఉపవాసదీక్షను పాటిస్తే  జీవితంలో ఆనందం.. ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు. పరివర్తన ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తే... పెండింగ్​ లో ఉన్న పనులు పూర్తవుతాయి.  

పూజావిధానం..

  • ఉదయాన్నే స్నానం చేసి శుబ్రమైన బట్టలు ధరించాలి.. మడి బట్టలు ధరిస్తే చాలా మంచిది. 
  • పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించుకోవాలి.  పూజామందిరంలో విష్ణుమూర్తి ఫొటో ఉంటే ప్రత్యేకంగా అవసరం లేదు. 
  • విష్ణుమూర్తికి పచ్చని పూలతో ..పూల దండ  సమర్పించాలి. 
  • సంకల్పం చెప్పుకొని కోరికలు తీరాలని.. భక్తితో పూజ చేయాలి.  విష్ణు సహస్రనామం పఠించాలి.. లేదా.. వినాలి.  
  •  పూజలో కచ్చితంగా తులసి దళాలు ఉండాలి.  
  • ధూపం.. దీపం.. నైవేద్యం సమర్పించాలి. పచ్చని పండ్లను స్వామివారికి సమర్పించాలి. 
  • ఉపవాస దీక్షను పాటించాలి. విష్ణువుకు సంబంధించిన మంత్రాలను జపించాలి.  
  • కృష్ణావతారంలో ఉన్న శ్రీమహావిష్ణువుకు వెన్న, కలకండ (పటిక బెల్లం) నైవేద్యంగా పెట్టడం వల్ల ..  అన్ని కోరికలు నెరవేరుతాయని  పండితులు అంటున్నారు.
  • విష్ణువుతోపాటు లక్ష్మీదేవి, వినాయకుడిని పూజిస్తే అదృష్టం  కలసివస్తుంది. 
  • నిరుపేదలకు పసుపు రంగు వస్త్రాలను దానం చేస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి. 
  • ఓం వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ
     పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ”
  • అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని యధాశక్తి పూజించడం వలన, అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని చెబుతున్నారు. 

పరివర్తన ఏకాదశికి మన ప్రకృతి లో వచ్చే మార్పులకు సంబదించినదిగా కూడా పరిగణిస్తారు. కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు.  ఈ రోజునే శ్రీ మహా విష్ణువు వామనావతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళ లోకానికి పంపిస్తాడని వేదాలు చెబుతున్నాయి. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతరాన్ని పూజించడం వలన.. ఉపవాసం ఉండటం వలన  బ్రహ్మ -విష్ణు -మహేశ్వరులని సేవిస్తే .. ఎంతటి ఫలితం ఉంటుందో అంతటి  ఫలితం లభిస్తుందని  పురాణాలు  చెబుతున్నాయి.