శ్రావణ శనివారం ( ఆగస్టు 2) : అప్పుల బాధలు తీరాలంటే ఏమి చేయాలో తెలుసా..!

 శ్రావణ శనివారం ( ఆగస్టు 2) : అప్పుల బాధలు తీరాలంటే ఏమి చేయాలో తెలుసా..!

హిందూ సంప్రదాయంలో శ్రావణమాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణ శనివారం రోజు కొన్ని పూజలు చేస్తే  అనుకున్న పనులు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 2 శ్రావణమాసం.. శనివారం రోజు ఎలాంటి పూజలు చేయాలో తెలుసుకుందాం. .. . 

శ్రావణ మాసంలో వచ్చే శనివారం ( ఆగస్టు2)  ఇంటి ఇలవేల్పుని పూజించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోతే.. కనీసం ఒక్క శనివారమైనా.. పూజా విధానాన్ని ఆచరించడం అన్నివిధాలా మంచిదని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా కలియుగదైవమైన ఆ వేంకటేశ్వరుడికి ఆరాధన అనేది అత్యంత శక్తివంతం. శనివారాల్లో స్వామికి పాయసం , రవ్వకేసరి వంటి తీపిపదార్థాలు ప్రసాదంగా సమర్పించాలట. పిండి దీపాలతో స్వామివారిని ఆరాధించాలి. ఉపవాసం ఉండాలి. ఇలాంటి అన్ని చేసినట్లయితే అప్పుల బాధల నుంచి విముక్తి కలగడమే కాకుండా ...  విశేష ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు.

ఇంకా ఏమేమి చేయాలంటే..

  • శ్రావణ శనివారం (ఆగస్టు2)  రోజున ప్రదోష కాలంలో రావిచెట్టుకింద ఆవునేతితో దీపారాధన చేస్తే.. ఐశ్వర్యం కలుగుతుంది.
  • పేదలకు అన్నదానం  చేయడం వలన కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి.
  • పేదలకు  బట్టలు దానం చేస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
  • శ్రావణ శనివారం రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేస్తే ..ఈతి బాధలనుంచి విముక్తితో పాటు మృత్యుభయం తొలుగుతుంది. 
  • ఆంజనేయస్వామి ఆలయంలో ప్రశాంతంగా.. భక్తితో.. శ్రద్దతో హనుమాన్​ చాలీసా పారాయణం చేస్తే అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది.

కలియుగంలో విష్ణుమూర్తి ఎన్నో రూపాల్లో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించేందుకు భూలోకానికి వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి రూపాల్లో అర్చితామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవేకంటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడని వేదాల్లో రుషులు పేర్కొన్నారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. శ్రీనివాసుడి నక్షత్రం శ్రవణం. కాబట్టి ఈనెలలో (శ్రావణమాసంలో)  శనివారాల్లో శ్రీవేంటేశ్వరస్వామిని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయట. పూర్వం నుంచి శ్రావణ శనివారాల్లో వ్రతాలు చేయడం , పూజలు , ఉపవాసాలు వంటి ఆచారాలు ఉన్నాయి.