రంజాన్ పండుగ విశిష్టత.. సంప్రదాయం.. మరిన్ని విశేషాలు .. మీకోసం..

రంజాన్ పండుగ విశిష్టత.. సంప్రదాయం.. మరిన్ని విశేషాలు .. మీకోసం..

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింసోదరులు జరుపుకొనే   ప్రధాన పండుగల్లో ఈదుల్‌ ఫిత్ర్ (రంజాన్​) ...ఈ పండుగకు  అత్యంత ప్రాముఖ్యత ఉంది.  ఇస్లామిక్​ కేలండరు ప్రకారం, సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెలగా ఉన్న రంజాన్‌ ముప్పయి రోజులు ఉపవాస దీక్షలు పాటించి పదవ నెల అయిన షవ్వాల్‌ మొదటి తేదీన జరుపుకునే పండుగే ఈదుల్‌ ఫిత్ర్ . సాధారంగా దీన్ని రంజాన్‌ పండుగ అని వ్యవహరిస్తుంటారు

రంజాన్​ పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతి వికాసానికి దోహదం చేస్తాయి. అన్ని మతాల పండుగల వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. మానవాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు చాంద్రమాన కేలండర్ ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామిక్​ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం  ' దివ్య ఖురాన్' ముస్లింల పవిత్ర  గ్రంథం ఈ మాసంలో అవిర్భవించిదని ముస్లిం ప్రవక్తలు చెబుతుంటారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసమని అంటారు.

 ముస్లింలు పవిత్ర ఉపవాసాలు ముగింపు రోజే రంజాన్​ పండుగ.  దీనిని ఈద్-ఉల్-ఫితర్ అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ముస్లింలు ఉపవాసం ఉండడానికి వీల్లేని షవ్వల్ మాసంలో మొదటి రోజు, అంతేకాక ఏకైక రోజు కూడా. ఈద్ షవ్వల్ మాసం తొలిరోజు అవుతుంది.

చాంద్రమాన హిజ్రీ నెల తేదీలు స్థానికంగా చంద్రోదయంపై ఆధారపడివుండడంతో, స్థానిక మతాధిపతులు నెలవంక కనిపించడంపై ఈ పండుగను ప్రకటిస్తారు. దాంతో ఈద్-ఉల్-ఫితర్ ప్రాంతాలవారీగా వేర్వేరు రోజుల్లో జరుపుకుంటారు. మన దేశంలో ఈ సంవత్సరం ఈద్-ఉల్-ఫితర్ ఏప్రిల్​ 11 , గురువారం జరుపుకుంటున్నారు.ఈద్-ఉల్-ఫితర్ నాడు ప్రత్యేకమైన సలాత్ (ఇస్లామీయ ప్రార్థన) చేస్తారు. సాధారణంగా బహిరంగ స్థలంలో కానీ, భారీ హాలులో కానీ ఈ ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనను కేవలం సమూహంగానే (జమాత్) చేస్తారు. అందరూ కలిసి అల్లా గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తారు.

ఈదుల్‌ ఫిత్ర్ పండుగ మానవుల్లో అత్యున్నత మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొదిస్తుంది. పరోపకార గుణాన్ని, సహనం , త్యాగం, కరుణ, సానుభూతి భావాలను ...  సమాజంలో సమానత్వం, సోదరభావం, సామరస్య వాతావరణాన్ని సూచిస్తుంది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది.అందరూ ఒకచోట గుమిగూడి  రోజూవ్రతం ఆచరించే మహాభాగ్యం కలగజేసి, మానవుల మార్గదర్శనం కోసం, సమాజంలో విలువల విస్తృతి కోసం పవిత్ర ఖురాన్‌ గ్రంథం అవతరింప జేసినందుకు దైవానికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ  నమాజ్‌ చేస్తారు. తరువాత ఇమామ్‌ ఖురాన్, హదీసుల వెలుగులో నైతిక, ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తారు. 

రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు, సంపన్నులైనవారు రంజాన్ నెలలో జకాత్ అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని జకాత్ అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి 30 శాతం  ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ జకాత్ ఉపయోగపడుతుంది.

జకాత్ తో పాటు ఫిత్రా దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోదిస్తూవుంది. దీనినే  ఫిత్రాదానం అని పిలుస్తారు. ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు.

ఫిత్రా దానంలో రెండు కిలోల గోధుమలను గానీ, దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెట్టాలి. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. దీనివలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం ఉంది. దైవ ప్రవక్త ఫిత్రాధానాన్ని విధిగా నిర్ణయించడానికి కారణం - ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు జరుగుతూ వుంటాయి. ఇలాంటి అనాలోచిత పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి ' అని మహమ్మద్‍  ప్రవక్త అనుచరుడు అబ్దుల్లా బిన్ మసూద్ తెలిపారు.

మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగించి అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించి చిరుజీవితాన్ని ఆనందంతో నింపి పుణ్యకార్యాల వైపు దృష్టి మరల్చే రంజాన్ మాసం చైతన్యాన్ని కలిగించి ముందుకు సాగే ధైర్యాన్నిస్తుంది. ఈ పండుగను పేద, ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగ నమాజును ఊరిబయట నిర్ణీత ప్రదేశాలైన ఈద్‍గాహ్ లలో చేస్తారు. అనంతరం ఒకరికొకరు ఈద్‍ముబారక్(శుభాకాంక్షలు)చెప్పుకుంటారు.

ముస్లిం ప్రజలు తమ కోసం, తమ కుటుంబం కోసం, బంధుమిత్రుల కోసం, తమ దేశం కోసం, దేశవాసుల సుఖ సంతోషాల కోసం, యావత్‌ ప్రపంచ శాంతి సంతోషాల కోసం ఆయనను ప్రార్థిస్తారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అభివాదాలు, ఆలింగనాలు చేసుకుంటూ తమ అంతరంగాల్లోని ఆనందాన్ని పంచుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారుచేసిన తీపి వంటకాలను తమ హిందూ ముస్లిం, క్రైస్తవ, సిక్కు సోదరులందరికీ రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు. కనుక రంజాన్‌ స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలి. నెలరోజుల ఉపవాస  ప్రభావం భావి జీవితంలో ప్రతిఫలించాలి. మళ్లీ రంజాన్‌ వరకు ఈ తీపి అనుభూతులు మిగిలి ఉండాలి. అల్లా సమస్త మానవాళినీ సన్మార్గ పథంలో నడిపించాలని... పుడమిపై శాంతి వర్ధిల్లాలని.... యావత్‌ ప్రపంచం  సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుందాం...