2030 నాటికి వంద మిలియన్ టన్నుల కోల్ ప్రొడక్షన్ టార్గెట్ : సింగరేణి డైరెక్టర్ ఎల్వీ సూర్యనారాయణ

2030 నాటికి వంద మిలియన్ టన్నుల కోల్ ప్రొడక్షన్ టార్గెట్ : సింగరేణి డైరెక్టర్ ఎల్వీ సూర్యనారాయణ
  •  సింగరేణి డైరెక్టర్​ ఎల్వీ సూర్యనారాయణ​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బహుముఖ విస్తరణ దిశగా సింగరేణి వడివడిగా అడుగులు వేస్తోందని సింగరేణి కాలరీస్​ కంపెనీ డైరెక్టర్​ ఆపరేషన్స్​ ఎల్వీ సూర్యనారాయణ​ పేర్కొన్నారు. సింగరేణి డే సెలబ్రేషన్స్​లో భాగంగా మంగళవారం కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​ లో సింగరేణి జెండాను ఆయన ఎగురవేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వళన చేసి వేడుకలను ప్రారంభించారు. 

సింగరేణి ఆవిర్భావం సందర్భంగా డైరెక్టర్లు కె. వెంకటేశ్వర్లు, ఎం. తిరుమల రావుతో కలిసి కేక్​ను కట్​ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2030 నాటికి వంద మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. కోల్​ ఇండియా పదేండ్లలో రెట్టింపు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. కొత్త మైన్స్​ కోసం సింగరేణి ఇక నుంచి వేలంలో పాల్గొంటుందన్నారు. 

మణుగూరు డీప్​సైడ్​ ఓసీ కోసం టెండర్లు వేసిందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్​లో నెలకొన్న పోటీని తట్టుకొనేలా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటూ నాణ్యతతో కూడిన బొగ్గును వినియోగదారులకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. బొగ్గుతో పాటు కీలక ఖనిజాల వైపు సింగరేణి దృష్టి పెట్టిందని తెలిపారు. గోల్డ్​, కాపర్​ మైన్స్​ కోసం కృషి చేస్తున్నామన్నారు.

 2047 విజన్​ డాక్యుమెంట్​తో సింగరేణి ముందుకు సాగుతోందన్నారు. కార్మిక సంక్షేమానికి యాజమాన్యం పెద్ద పీట వేస్తోందని చెప్పారు. అనంతరం ఉత్తమ ఆఫీసర్​గా ఎంపికైన బి. శ్రీనివాస రావు, ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన కె. వెంకటేశ్వర ప్రసాద్, డీవీవీ నాగేంద్ర ప్రసాద్​ను సన్మానించారు. ఈ ప్రోగ్రాంలో జీఎం వెల్ఫేర్​ జీవీ. కిరణ్​ కుమార్​, సీఎంఓఏఐ ప్రెసిడెంట్​ టి. లక్ష్మీపతిగౌడ్​, ఐఎన్​టీయూసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ త్యాగరాజన్​తో పాటు పలువురు ఆఫీసర్లు పాల్గొన్నారు. 

సాదాసీదాగా.. 

ఈసారి సింగరేణి డే సెలబ్రేషన్స్​ యాజమాన్యం సాదాసీదాగా నిర్వహించింది. సింగరేణి హెడ్డాఫీస్​అయిన కొత్తగూడెంతో పాటు అన్ని ఏరియాల్లో సెలబ్రేషన్స్​ను పెద్ద ఎత్తున యాజమాన్యం గత కొన్నేండ్లుగా నిర్వహిస్తోంది. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంతో పాటు అన్ని ఏరియాల్లోని సింగరేణి గ్రౌండ్స్​ల్లో సాయంత్రం టైంలో ఆటా పాటలతో గ్రాండ్​గా చేసే వారు. ఈ సారి సెలబ్రేషన్స్​ ఆఫీసులకే పరిమితమయ్యాయి.