కార్మిక సంక్షేమంపై సింగరేణి ఫోకస్​

కార్మిక సంక్షేమంపై సింగరేణి ఫోకస్​
  •     సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్స్​గా ఆరు ఏరియాల్లోని హాస్పిటల్స్​
  •     స్కూళ్ల ఆధునీకరణతోపాటు  సీబీఎస్​ఈ సిలబస్​
  •     పాత క్వార్టర్ల స్థానంలో మోడ్రన్ క్వార్టర్స్ ​
  •     కొత్త ప్రపోజల్స్​ సిద్ధం 

హైదరాబాద్​, వెలుగు : సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమం​పై దృష్టి పెట్టింది. వెల్​ఫేర్​లో భాగంగా కార్మికులకు, వారి కుటుంబాలకు విద్య, వైద్యం, వసతుల కల్పనపై ప్రధానంగా ఫోకస్​ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కార్మికుల శ్రేయస్సు కోసం కొత్త ప్రపోజల్స్​ సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన కార్మికులను, వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.కోటి ప్రత్యేక బీమా సదుపాయాన్ని కల్పించగా మరిన్ని సౌలతులు కల్పించేందుకు రెడీ అవుతున్నది.     

ఇక అన్ని సింగరేణి స్కూళ్లలో సీబీఎస్​ఈ

కార్మికుల పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూ డిన చదువులు అందించాలని కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో కార్మికుల పిల్లల కోసం నిర్వహిస్తున్న స్కూళ్లను ఆధునీకరించాలని నిర్ణయించింది. ఢిల్లీలో గవర్నమెంట్​స్కూళ్ల తరహాలో సింగరేణి సూళ్లను డిజిటలీకరణ చేయాలని సంకల్పించారు. అదే విధంగా ఇప్పటి వరకు కొనసాగుతున్న స్టేట్​ సిలబస్​ స్థానంలో సీబీఎస్​ఈ సిలబస్​కు అప్​గ్రేడ్​ చేయాలని నిర్ణయించారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాలేజీలను, ఇంజినీరింగ్ ​కాలేజీలను ఆధునీకరించాలని యోచిస్తున్నారు. 

మోడ్రన్ క్వార్టర్స్​గా అభివృద్ధి..

దశాబ్ధాల కాలంగా ఉన్న కార్మికుల పాత క్వార్టర్స్​అన్నింటినీ ఆధునీకరించాలని సింగరేణి యాజమాన్యం యోచిస్తోంది. ఇప్పటివరకు ఆఫీసర్లకు మాత్రమే మోడ్రన్​ క్వార్టర్స్ ​సదుపాయం కల్పించగా, ఇక నుంచి కార్మికుల క్వార్టర్స్​ను కూడా అప్​గ్రేడ్​ చేయాలని అనుకుంటోంది. సింగరేణి ఆరు ఏరియాల పరిధిలో ఇప్పటివరకు 42వేలకు పైగా కార్మికులున్నారు. ఈ కార్మిక కుటుంబాలు చాలా వరకు పాత క్వార్టర్స్​లోనే ఉంటున్నాయి.  

.కొన్ని చోట్ల క్వార్టర్ల నిర్వహణ సరిగ్గా లేక పాములు వస్తున్నాయి. వానాకాలం సీజన్​లో అయితే కార్మికులు చాలా తిప్పలు పడుతున్నారు. వీటిని అధిగమించి కార్మికుల రిస్థితిని మెరుగుపర్చాలని యాజమాన్యం నిర్ణయించింది. పాత క్వార్టర్స్ తొలగించి వాటి స్థానంలో మోడ్రన్​ డిజైన్​తో నిర్మించాలని నిశ్చయించింది. సంస్కరణల్లో భాగంగా కొత్త పంథాలో ముందుకు సాగాలని సింగరేణి యోచిస్తోంది. కొత్త సీఎండీ సారథ్యంలో సింగరేణి సంస్కరణలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. 

సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్స్​గా అప్​గ్రేడ్​..
 
సింగరేణిలోని ఆరు ఏరియాల్లోని హాస్పిటల్స్​ను సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్స్​గా తీర్చిదిద్దాలని సింగరేణి భావిస్తోంది. ఇప్పటి వరకు కొనసాగుతున్న కొత్తగూడెం, రామగండంతో పాటు పలు ఏరియాల్లోని హాస్పిటల్స్​ను అప్​గ్రేడ్​ చేయాలని యోచిస్తోంది. ఇంతవరకు సింగరేణి దవాఖానల్లో సాధారణ వైద్యమే చేస్తుండగా..అత్యాధునిక వైద్యం కోసం హైదరాబాద్​లోని నిమ్స్​తో పాటు,  ప్రైవేటు కార్పొరేట్​హాస్పిటల్స్​కు పంపేవారు. అయితే, ఇక నుంచి పూర్తిస్థాయిలో గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, ఆర్థోపెడిక్​తదితర స్పెషలైజేషన్స్​ను అందుబాటులోకి తీసుకు వచ్చి సూపర్​స్పెషాలిటీ సేవలు అందించనున్నారు.