- అన్ని జీఎంల ఏరియాలకు సింగరేణి యాజమాన్యం ఆదేశం
- ప్రచారంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని కామెంట్
- కోల్ బెల్ట్లో బీఆర్ఎస్కు వ్యతిరేకత వల్లే మైన్స్ వద్ద ప్రచారాన్ని నిషేధించారంటున్న యూనియన్లు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : బొగ్గు గనుల వద్ద ఎన్నికల ప్రచారాన్ని నిషేధిస్తూ సింగరేణి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో విస్తరించిన సింగరేణి మైన్స్, డిపార్ట్మెంట్లలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిషేధిస్తూ యాజమాన్యం రెండు, మూడు రోజుల కింద అన్ని జీఎం ఏరియాలకు ఉత్తర్వులను పాస్ చేసింది. ఎన్నికల ప్రచారం వల్ల పారిశ్రామిక అశాంతితో పాటు బొగ్గు ఉత్పాదనకూ ఆటంకం కలిగే అవకాశం ఉందని ఆ ఉత్తర్వుల్లో యాజమాన్యం పేర్కొంది. కొత్తగూడెం, సత్తుపల్లి, పినపాక, ఇల్లెందు, మంచిర్యాల, మంథని, బెల్లంపల్లి, హుస్నాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, చెన్నూరు, రామగుండం
పెద్దపల్లి నియోజకవర్గాల పరిధిలో ఉన్న సింగరేణివ్యాప్తంగా అన్ని అండర్గ్రౌండ్, ఓపెన్కాస్ట్ మైన్స్తో పాటు డిపార్ట్మెంట్ల వద్ద నోటీసులు వేశారు. సాధారణంగా కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు మార్నింగ్, సెకండ్ షిఫ్ట్లో మైన్స్వద్ద గేట్ మీటింగ్ లు నిర్వహిస్తుంటారు. ఈసారి గేట్ మీటింగ్లు నిర్వహించడానికి వీల్లేదని యాజమాన్యం పేర్కొనడం కార్మికుల్లో చర్చనీయాంశమైంది. గేట్ మీటింగ్లతో సంబంధం లేకుండా ఆయా పార్టీలకు అనుబంధంగా ఉన్న యూనియన్లు తమ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులు, కార్మికులతో మాట్లాడిస్తూ ఓట్లు అడిగేలా ప్లాన్ చేస్తున్నాయి. నామినేషన్ల పర్వం ప్రారంభమైందంటే మైన్స్పై అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తుంటారు.
దీంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగడంతో పాటు రాజకీయ విభేదాలకు నెలవుగా మైన్స్ మారే అవకాశం ఉందని భావిస్తూ యాజమాన్యం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. అయితే, కోల్ బెల్ట్లో అధికార బీఆర్ఎస్ పైవ్యతిరేకత పెరగడం వల్లే బొగ్గు బావుల వద్ద ఎన్నికల ప్రచారాన్ని యాజమాన్యం నిషేధించిందని పలు యూనియన్ల లీడర్లు ఆరోపిస్తున్నారు. మార్నింగ్, సెకండ్ షిఫ్ట్ల స్టార్టింగ్ సమయాల్లో కనీసం గంట టైం ప్రచారానికి ఇవ్వాలని యూనియన్ల లీడర్లు కోరుతున్నారు.