హైదరాబాద్, వెలుగు: బొగ్గు రవాణా పకడ్బంధీగా జరుగుతుందని, బొగ్గు చోరీకి గురైందని, కనిపించడం లేదంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సింగరేణి సంస్థ యాజమాన్యం ప్రకటించింది. బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, రవాణా, విక్రయాలు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు యాజమాన్యం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. “సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి అయిన క్షణం నుంచి వినియోగదారుడికి చేరే వరకు ప్రతి దశ డిజిటల్గా రికార్డ్ అవుతోంది. బొగ్గులో 85 శాతం రైల్వే, 15 శాతం రోడ్డు మార్గాల ద్వారా సరఫరా చేస్తున్నాం.
బొగ్గు కేటాయింపులు సాప్ (ఎస్ఏపీ) ఆధారిత వ్యవస్థ ద్వారా జరుగుతున్నాయి. వినియోగదారుడు, గని, పరిమాణం, సరఫరా తేదీ తదితర వివరాలు ముందుగానే డిజిటల్గా నమోదవుతాయి. ప్రతి టన్ను బొగ్గుపై కోట్ నెట్, సాప్ లాంటి వ్యవస్థల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది” అని సింగరేణి ఆపరేషన్స్ విభాగం ఉన్నతాధికారులు వెల్లడించారు. ‘‘రోడ్డు మార్గంలో బొగ్గు రవాణా చేసే ప్రతి వాహనాన్ని ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జ్ల వద్ద తూకం వేస్తాం.
రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) ఆధారిత బూమ్ బ్యారియర్లు, జీపీఎస్, జీపీఆర్ఎస్ ట్రాకింగ్, జియోఫెన్సింగ్ వ్యవస్థల ద్వారా వాహనాల కదలికలపై రియల్ టైమ్ పర్యవేక్షణ కొనసాగుతోంది” అని ప్లానింగ్ విభాగం ఉన్నతాధికారులు పేర్కొన్నారు. “రైల్వే మార్గంలో ప్రతి వ్యాగన్ లోడింగ్, డిస్పాచ్ వివరాలు డిజిటల్గా నమోదవుతున్నాయి. గనులు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు( సీహెచ్పీ), వేబ్రిడ్జ్లు, రైల్వే సైడింగ్స్, స్టాక్ యార్డులు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు, ఆర్ఎఫ్ఐడీ వ్యవస్థలు, చెక్ పోస్ట్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, భద్రతా సిబ్బంది 24 గంటలూ పర్యవేక్షిస్తారు” అని బొగ్గు రవాణా విభాగం ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అలాగే ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు.
