సింగరేణి స్కామ్తో ప్రభుత్వంలో వణుకు : కేటీఆర్

సింగరేణి స్కామ్తో ప్రభుత్వంలో వణుకు : కేటీఆర్
  •     మేం బయటపెట్టినప్పటి నుంచి వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నయ్: కేటీఆర్​
  •     సీబీఐ లేదా సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలి
  •     గవర్నర్​కు ఫిర్యాదు చేసిన కేటీఆర్​ నేతృత్వంలోని బీఆర్​ఎస్​ నేతలు 

హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని హరీశ్​ రావు ఆధారాలతో బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్​ ప్రభుత్వంలో వణుకు మొదలైందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు చేసే సరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. ఆధారాలతో సహా ఈ వ్యవహారంపై గవర్నర్​కు ఫిర్యాదు చేశామని తెలిపారు. సింగరేణిని రేవంత్​ కబళిస్తున్నారని, ఈ అంశంలో ఇన్వాల్వ్​ కావాలని కోరామన్నారు. సిట్టింగ్​ జడ్జి లేదా సీబీఐతో ఎంక్వైరీ చేయించేలా కిషన్​రెడ్డికి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. 

మంగళవారం సాయంత్రం కేటీఆర్​ నేతృత్వంలోని బీఆర్​ఎస్​ నేతలు.. సింగరేణి వ్యవహారంపై గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో కేటీఆర్​మాట్లాడారు. సింగరేణి అవినీతి వ్యవహారాన్ని డైవర్ట్​ చేసేందుకు విచారణ పేరిట ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నారని విమర్శించారు. సీఎం అంటే చీఫ్​ మినిస్టర్​ కాదని, ఇప్పుడు దానిని కోల్​ మాఫియాకి నాయకుడిగా ప్రజలు, సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి ఏర్పడిందన్నారు.

 సైట్​ విజిట్​ ఎందుకు పెట్టారంటే నో ఆన్సర్

దేశంలో ఏ బొగ్గు గనిలోనూ లేనివిధంగా సైట్​ విజిట్​ సర్టిఫికెట్​ అనే నిబంధనను ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదని కేటీఆర్​ విమర్శించారు. 2018 నుంచి 2024 మధ్యన కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను సిఫార్సు చేసి ఉన్నా.. బీఆర్​ఎస్​ ప్రభుత్వం అమలు చేయలేదని చెప్పారు. ‘‘టెండర్​ చేస్తారు.. మళ్లీ వెంటనే ఆ టెండర్​ను రద్దు చేస్తారు. టెండర్​లో ఈ నిబంధన లేకుండా ఆ రోజు మీరు టెండర్​ పిలిస్తే మైనస్ 7 శాతం అంటే ఎస్టిమేట్ చేసిన దానికంటే 100 రూపాయలకు ఎస్టిమేట్ చేస్తే 93 రూపాయలకే పని చేస్తామని కాంట్రాక్ట్ సంస్థలు ముందుకు వచ్చాయి. 

కానీ, దాన్ని మీరు రద్దు చేశారు. ఈ సైట్​ విజిట్​ నిబంధన పెట్టారు. దానివల్ల ఏమైంది? తిరిగి మళ్లీ టెండర్​ను పిలిస్తే ప్లస్ 12 శాతం.. అంటే 100 రూపాయలకయ్యే పని 112 రూపాయలకి కావాలని చెప్పి మరి సంస్థలు వచ్చిన మాట వాస్తవం కాదా?’’ అని ప్రశ్నించారు. ఈ నిబంధన పెట్టిన మే 25 నుంచి ఇప్పటివరకు ఎన్ని సంస్థలు సైట్​ను సందర్శించారో.. ఎన్ని ఈ మెయిల్స్​ వచ్చాయో.. ఎంతమందికి సర్టిఫికెట్​ ఇచ్చారో శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.