పీఎల్ఎఫ్​లో దేశంలోనే నంబర్​వన్​గా జైపూర్​ పవర్​ ప్లాంట్​

పీఎల్ఎఫ్​లో దేశంలోనే నంబర్​వన్​గా  జైపూర్​ పవర్​ ప్లాంట్​

మందమర్రి/జైపూర్, వెలుగు:మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలంలోని సింగరేణి థర్మల్​పవర్ ప్లాంట్ కరెంట్​ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్​గా నిలిచింది. దేశవ్యాప్తంగా 250  ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని విద్యుత్​ కేంద్రాల కన్నా సింగరేణి థర్మల్​పవర్​ప్లాంట్​అత్యధిక ప్లాంట్ లోడ్​ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించినందుకు సింగరేణి ఎస్టీపీపీ ఉద్యోగులు, ఆఫీసర్లను గురువారం సీఎండీ ఎన్. శ్రీధర్​ అభినందించారు. 2026 నాటికి సింగరేణి సంస్థ మూడు వేల మెగావాట్ల థర్మల్, సోలార్​పవర్​ను ఉత్పత్తి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. 

అత్యుత్తమ పీఎల్​ఎఫ్​

2022–-23 ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో జైపూర్​సింగరేణి థర్మల్​పవర్​ప్లాంట్​90.86 శాతం పీఎల్ఎఫ్​ సాధించింది. పవర్​ప్లాంట్​ను ప్రారంభించిన ఆరేండ్లలోనే దేశంలోని 25 అత్యుత్తమ పవర్​ప్లాంట్ల జాబితాలో అగ్రస్థానలో నిలవడం పట్ల సింగరేణి యాజమాన్యం హర్షం ప్రకటించింది. చత్తీస్​గఢ్​లోని ఎన్టీపీపీసీ కోర్బా సూపర్​పవర్​థర్మల్​ స్టేషన్​90.01 శాతం పీఎల్​ఎఫ్​తో రెండో స్థానం, మధ్యప్రదేశ్​లోని సింగ్రోళీ థర్మల్​పవర్​ ప్లాంట్​89.94 శాతం పీఎల్ఎఫ్​తో మూడో స్థానంలో నిలిచాయి. 

నాలుగుసార్లు వంద శాతం..

2016 సంవత్సరం ఆగస్టులో ప్రారంభమైన జైపూర్​సింగరేణి థర్మల్​పవర్​ప్లాంట్​ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు 100 శాతం పీఎల్​ఎఫ్​ సాధించింది. 2018 సెప్టెంబర్​, 2019 ఫిబ్రవరి, 2020 ఫిబ్రవరి, 2022 మార్చి నెల్లలో ఈ ఘనత సాధించింది. రెండు యూనిట్లు ఉన్న ప్లాంట్​లో రెండో యూనిట్​10 సార్లు, ఒకటోయూనిట్​ ఏడు సార్లు వంద శాతం పీఎల్​ఎఫ్​దాటినట్లు సింగరేణి యాజమాన్యం పేర్కొంది. ఆరేండ్లలో సింగరేణి థర్మల్​పవర్​ప్లాంట్​ రాష్ట్ర అవసరాల కోసం 51,547 మిలియన్​యూనిట్ల విద్యుత్​ను గ్రిడ్​కు అనుసంధానం చేసింది. సీఎం కేసీఆర్​ ఆదేశాలతో పవర్​ప్లాంట్​లో మరో 800 మెగావాట్ల మూడో యూనిట్​ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. 

సోలార్​ పవర్​లోనూ హవా..

థర్మల్​పవర్​ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న సింగరేణి సంస్థ సోలార్​ పవర్​జనరేషన్​లోనూ అదే జోరు సాగిస్తోంది. ఇప్పటికే 219 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేసి పవర్​ఉత్పత్తి చేస్తోంది. మూడో విడత 81 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా జైపూర్ ఎస్టీపీపీ రిజర్వాయర్​లో 15 మెగావాట్ల వాటర్​ ఫ్లోటింగ్​సోలార్​ ప్లాంట్​నిర్మిస్తోంది. ప్రస్తుతం 1,200 మెగావాట్ల థర్మల్​ విద్యుత్​ కేంద్రంతో పాటు 2026 నాటికి మరో 800 మెగావాట్ల మూడో యూనిట్, ప్రతిపాదిత 300 మెగావాట్ల సోలార్, రాష్ట్ర సర్కార్​ పర్మిషన్​తో భారీ రిజర్వాయర్లపై మరో 1000 మెగావాట్ల వాటర్​ ఫ్లోటింగ్​ సోలార్​ పవర్​తో కలిపి 3వేల మెగావాట్ల పవర్​ను ఉత్పత్తి చేయాలని టార్గెట్​గా ఎంచుకున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్​ గురువారం తెలిపారు. సింగరేణి ఎస్టీపీపీ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించేందుకు కృషి చేయాలని ఉద్యోగులు, ఆఫీసర్లకు పిలుపునిచ్చారు.