- హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు సిరిసిల్ల వాసులు
- తెరపైకి క్షమాభిక్ష దరఖాస్తు
- న్యాయ సహాయం అందిస్తే విడుదల సాధ్యం
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. ఉన్న ఊళ్లో ఉపాధి కరువై పొట్ట చేతబట్టుకొని గల్ఫ్వెళితే.. అక్కడ హత్య కేసులో ఇరుక్కున్నారు. 15 ఏండ్లుగా దుబాయ్జైలులో మగ్గుతున్నారు. 2004లో రాజన్నసిరిసిల్ల జిల్లా పెద్దూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం, రవి, చందుర్తి మండలానికి చెందిన గోలం నాంపల్లి, శివరాత్రి హన్మండ్లు, కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్ దుబాయ్ వెళ్లారు. ఆరు నెలల అనంతరం నేపాల్కు చెందిన బహుద్దూర్సింగ్అనే వాచ్మెన్హత్యకు గురయ్యాడు. అక్కడే పని చేస్తున్న జిల్లావాసులు ఐదుగురు ఈ కేసులో ఇరుక్కున్నారు. దుబాయ్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దుబాయ్చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబసభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో క్షమాభిక్ష పత్రాలపై నేపాల్కు చెందిన హత్యకు గురైన వ్యక్తి కుటుంబసభ్యులతో సంతకాలు చేయించారు. వారికి ఆర్థిక సాయంగా రూ. 15 లక్షలు అందించారు. కానీ అప్పుడే దుబాయ్ చట్టాల్లో మార్పు వచ్చింది. వీరి క్షమాభిక్ష కొట్టివేసింది. దీంతో 15 ఏళ్లుగా దుబాయ్ జైలులోనే మగ్గుతున్నారు. తాజా చట్టాల ప్రకారం 15 ఏండ్ల అనంతరం క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 ఫిబ్రవరి 7వ తేదీతో వీరి జైలు జీవితం 15 ఏండ్లు ముగిసింది. ఫిబ్రవరి 9న దుబాయ్ కోర్టుకు క్షమాభిక్ష పెట్టాలని దరఖాస్తు చేసుకోగా వీరి అభ్యర్థనను స్వీకరించింది.
జూన్ 14న కేసు విచారణ
క్షమాభిక్ష కేసు జూన్ 14న దుబాయ్ కోర్టులో మొదటి విడత విచారణకు రానుంది. ఈ కేసును దుబాయ్కు చెందిన లాయర్అనురాధ వాదిస్తున్నారు. ఈలోగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్షమాభిక్ష పెట్టాలని ఓ లెటర్దుబాయ్ ప్రభుత్వానికి రాయాల్సి ఉంది. భారత ప్రభుత్వం ఈ సహకారం అందిస్తే 10 ఏండ్ల జైలు శిక్ష రద్దయి.. విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమపై దయతో సాయం చేయాలని, దుబాయ్ ప్రభుత్వానికి లెటర్రాయాలని వేడుకుంటున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దుబాయ్లోని స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, ఎంబసీ అధికారులు తమకు న్యాయ సహాయం అందించాలని వేడుకుంటున్నారు.