- గత మీటింగ్లో ఇచ్చిన రూ.50 లక్షల వర్క్స్ ఏమాయ్యాయి..
- ఫండ్స్ కేటాయింపు తప్ప పనులు చేస్తలేరని అసహనం
- జీడబ్ల్యూఎంసీ మీటింగ్ లో ఆఫీసర్లను నిలదీసిన కార్పొరేటర్లు
హనుమకొండ, వెలుగు: పట్టణప్రగతి నాలుగు విడతలు ముగిసినా.. పనులు ఎక్కడియక్కడే ఉన్నాయని, కౌన్సిల్ లో తీర్మానించిన ఏ పనులూ స్టార్ట్ కావడం లేదని అధికార, ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్లు ఆఫీసర్లపై ఫైర్ అయ్యారు. గురువారం జీడబ్ల్యూఎంసీ జనరల్బాడీ మీటింగ్ మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ హాలులో జరిగింది. మీటింగ్ కు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు హాజరయ్యారు. ముందుగా ప్రజాప్రతినిధుల చేతులమీదుగా హరితహారం మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఎజెండాలోని ఎనిమిది ఎజెండా అంశాల్లో ఆరింటిని కౌన్సిల్ఆమోదించింది. అనంతరం నాలుగో విడత పట్టణ ప్రగతి పనులు, వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై హాట్హాట్గా చర్చ జరిగింది. నిధులు కేటాయింపులు తప్ప పనులు స్టార్ట్ చేయడం లేదని, అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతోందని కార్పొరేటర్లు మండిపడ్డారు. ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్లో ప్రతి డివిజన్కు కేటాయించిన రూ.50 లక్షలతో పనులు స్టార్ట్ కాకపోవడంపై అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఈ మీటింగ్లో ఒక్కో డివిజన్కు రూ.50 లక్షలు, దోమల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డివిజన్ కో ఫాగింగ్మెషీన్ను కేటాయించారు.
రోడ్డు మధ్యలోని కరెంట్ పోల్స్ఎప్పుడు తీస్తరు?
గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లలో కరెంట్ పోల్స్సమస్యగా మారాయని, కొన్నిచోట్ల రోడ్ల మధ్యలో ఉంటే, ఇంకొన్ని చోట్ల డ్రైన్ల మధ్యలో ఉన్నాయని, వాటిని తొలగించమని ఎన్నిసార్లు చెప్పినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదంటూ కార్పొరేటర్లు మండిపడ్డారు. రోడ్లపై ఉన్నవి, తుప్పు పట్టిన, వంగిన పోల్స్తో ప్రమాదాలు జరుగుతుండగా.. నాలాల్లో ఉన్న స్తంభాల వల్ల కాల్వలు నిండి నీళ్లన్నీ కాలనీల్లోకి వస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందని కార్పొరేటర్లు వాపోయారు. ఈ విషయమై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లను అడిగితే పొంతన లేని సమాధానం చెప్పడంపై లీడర్లు, కార్పొరేటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొన్ని డివిజన్లలో డీ సిల్టేషన్ చేయకున్నా చేసినట్లు చూపి ఫండ్స్ మింగేశారని ఆరోపించారు. చాలామందికి నల్లా లేకున్నా పన్నులు రావడం, కొంతమందికి డబుల్ ట్యాక్సులు విధిస్తుండటంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాగునీటి పైపులైన్లు లీకేజీలపై దృష్టి పెట్టాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, పబ్లిక్ హెల్త్, ఎన్పీడీసీఎల్అధికారులు పాల్గొన్నారు.
ఎజెండాపై ఎమ్మెల్సీ సారయ్య అసంతృప్తి
కౌన్సిల్ సమావేశాల అజెండా, సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎజెండాను ఫాలో అవడం లేదని, అలాంటప్పుడు జనరల్బాడీ మీటింగ్లు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. డిప్యూటీ మేయర్కు అద్దె వాహన సదుపాయం అనే అంశం ఎజెండాలో పెట్టాల్సింది కాదని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
విలీన గ్రామాలకు స్మార్ట్ సిటీ ఫండ్స్ కేటాయించాలి
ఏండ్లు గడుస్తున్నా విలీన గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని మరింత డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కాల్వలకు వెంటనే రిపేర్లు చేయాలని కోరారు. విలీన గ్రామాలకు స్మార్ట్ సిటీ ఫండ్స్ కేటాయించి, ఆయా గ్రామాల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని కోరారు.
- అరూరి రమేశ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే
ప్రతి డివిజన్కు 50 లక్షలు: మేయర్
గ్రేటర్ పరిధిలో మున్సిపల్జనరల్ ఫండ్ కింద రూ.151 కోట్లతో 457 పనులు జరుగుతున్నాయని, రూ.191.3 కోట్లతో 1,163 టెండర్ ప్రక్రియలో ఉన్నాయని మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కింద గ్రేటర్ పరిధిలో రూ.41.91 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. మరో రూ.31.88 కోట్లతో చేపట్టనున్న114 పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నాయన్నారు. పట్టణ ప్రగతి కింద ప్రతి డివిజన్కు రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్లు వివరించారు. పట్టణ ప్రగతిలో వివిధ విభాగాలకు సంబంధించిన నమోదైన 6,224 ఫిర్యాదుల్లో 1802 పరిష్కరించామని, మిగతా వాటిని సాల్వ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నగరంలో 20 మెయిన్ రోడ్లు, 40 కాలనీలను ముంపు ప్రాంతాలుగా గుర్తించి, ప్రత్యేక బృందాలతో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వతంత్ర్య భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలను ఆగస్టు 8 నుంచి 22 వరకు నిర్వహిస్తామని, ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసేలా ఇంటింటికీ జెండాలు పంపిణీ చేస్తామన్నారు. అంతకుముందు గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ బల్దియా పరిధిలో 10 అన్నపూర్ణ క్యాంటీన్లను నిర్వహిస్తున్నామన్నారు.