మేడిగడ్డ బ్యారేజీలో ఆరుగురు గల్లంతు

మేడిగడ్డ బ్యారేజీలో ఆరుగురు గల్లంతు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి / మహాదేవ్‌‌‌‌పూర్‌‌‌‌, వెలుగు: భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీలో శనివారం ఆరుగురు గల్లంతయ్యారు. వీరిలో నలుగురు యువకులు, ఇద్దరు బాలురు ఉన్నారు. సరదాగా ఈత కోసం నీటిలోకి దిగిన ఫ్రెండ్స్​లో ఆరుగురు నీట మునగగా ఒకరు సేఫ్‌‌‌‌గా ఒడ్డుకు చేరుకున్నారు. కన్నతండ్రి కళ్లెదుటే అతని ఇద్దరు కొడుకులు నీట మునగడం తీవ్ర విషాదాన్ని నింపింది.

విషయం తెలుసుకున్న కాటారం డీఎస్పీ రామ్మోహన్‌‌‌‌  రెడ్డి, సబ్‌‌‌‌  కలెక్టర్‌‌‌‌  మయాంక్‌‌‌‌  శర్మ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చీకట్లోనే మూడు రెస్క్యూ బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌‌‌‌పూర్‌‌‌‌  మండలం అంబట్‌‌‌‌పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామి, అతని ఇద్దరు కుమారులు మధుసూదన్‌‌ (19),‌‌ శివ మనోజ్‌‌‌‌ (17).. వారి ఫ్రెండ్స్  కర్నాల సాగర్‌‌ ‌‌(16), తొహరి రక్షిత్‌‌‌‌ (13), పట్టి శిమమణి, కొర్లకుంట గ్రామానికి చెందిన పసుల రాహుల్‌‌ ‌‌(21), స్తంభంపల్లి పీపీ గ్రామానికి చెందిన పాండు రామ్‌‌‌‌ చరణ్‌‌‌‌ (18)  గురువారం అంబట్‌‌‌‌పల్లిలో జరిగిన ఓ పెళ్లిలో పాల్గొన్నారు. శుక్రవారం రిసెప్షన్‌‌‌‌  ముగిసిన తర్వాత శనివారం వీళ్లంతా కలిసి మేడిగడ్డ బ్యారేజీకి వెళ్లారు. వెంకటస్వామికి చెందిన ఆటోలో అతని ఇద్దరు కొడుకులతో పాటు మిగతా ఐదుగురు ఫ్రెండ్స్‌‌‌‌  బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. తర్వాత బ్యారేజీలో ఈత కొట్టేందుకు కిందికి దిగారు. బ్యారేజీకి అప్‌‌‌‌ స్ట్రీంలో నాలుగో బ్లాక్‌‌‌‌  ఎదురుగా నీళ్లలో  కొద్దిసేపు ఆడుకున్నారు. మొత్తం ఏడుగురు ఫ్రెండ్స్‌‌‌‌లో పట్టి మధుసూదన్‌‌‌‌, శివమణికి మాత్రమే ఈత వస్తుంది. లోతుగా ఉన్న ప్రాంతంలో దిగవద్దని మిగతా వారికి వెంకటస్వామి హెచ్చరించాడు. కానీ, యువకులు ఆయన మాట వినకుండా  లోతుగా ఉన్న ప్రాంతానికి వెళ్లి ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు. ఈత వచ్చిన మధుసూదన్‌‌‌‌  వారిని రక్షించడానికి ప్రయత్నించగా అతన్ని కూడా గట్టిగా పట్టుకోవడంతో ఆ యువకుడు కూడా నీటిలో గల్లంతయ్యాడు. శివమణి వారిని రక్షించడానికి ప్రయత్నించేలోపే ఆరుగురు నీటిలో మునిగిపోయారు. దీంతో యువకుల కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు.

గోదావరి పరివాహక ప్రాంతంలో ఈత నిషేధం

భూపాలపల్లి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈత కొట్టడం, ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధించామని ఇన్ చార్జి జిల్లా కలెక్టర్  టీఎస్  దివాకర్  తెలిపారు. శనివారం మేడిగడ్డ బ్యారేజి వద్ద గోదావరి నదిలో ఈత కొట్టడానికి వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతైన ఘటనపై ఆయన స్పందించారు.  వీడియోలు, రీల్స్  మోజులో పడి యువకులు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారని, ఈ నేపథ్యంలో యువకుల  ప్రాణాలను రక్షించేందుకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఈత కొట్టడంపై నిషేధం విధించామని ఆయన తెలిపారు.