తెలంగాణలో విషాదం.. పిడుగులు పడి ఒకే రోజు ఆరుగురు మృతి

తెలంగాణలో విషాదం.. పిడుగులు పడి ఒకే రోజు ఆరుగురు మృతి

తెలంగాణలో విషాదం నెలకొంది.ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు   ఇవాళ (సెప్టెంబర్ 10న)ఒకే రోజు  వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఆరుగురు చనిపోయారు. నిర్మల్ జిల్లాలో ముగ్గురు, జోగులాంబ గద్వాల జిల్లాలో ముగ్గురు  మృతి చెందారు. 

నిర్మల్ జిల్లా  పెంబి మండలం గుమ్మేన ఏంగ్లాపూర్ మారుమూల గ్రామానికి చెందిన భార్యాభర్తలు అలకుంట ఎల్లయ్య, ఎల్లవ్వ మరో వ్యక్తి బండారు వెంకటి  గ్రామ సమీపంలోని వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగు పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 

జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం భూంపురం గ్రామంలో పొలంలో  పొలం పనులు  చేసుకుంటుండగా పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో  ఇద్దరు మహిళలు, ఒక యువకుడు   ఉన్నారు.  మృతులు భూంపురం  గ్రామానికి చెందిన పార్వతమ్మ (22) సర్వేస్ (20), సౌభాగ్య (40)ఉన్నారు. గాయాలైన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు స్థానికులు.  మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నారు. ముగ్గురు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. 

మూడు రోజులు వర్షాలు

 తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో మూడు గంటల పాటు భారీ వర్షాలు పడతాయని చెప్పింది. జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, మెదక్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ హన్మకొండ, యాదాద్రి మవనగిరి, జిల్లాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.