- మే నుంచే అమలు చేస్తున్నామన్న రాష్ట్ర సర్కార్
- ఇన్ని రోజులు దాచిన జీవో ఇప్పుడు బయటపెట్టిన్రు
హైదరాబాద్, వెలుగు: ఆయుష్మాన్ భారత్ వైద్య సేవలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీలో విలీనం చేసినట్లు హెల్త్ సెక్రటరీ రిజ్వీ చెప్పారు. పీఎంజేఈవై–ఆరోగ్యశ్రీ పేరుతో ఈ స్కీమ్ మే నెల నుంచే అమల్లో ఉందని వెల్లడించారు. ‘వెలుగు’లో గురువారం పబ్లిష్ అయిన ‘ఆయుష్మాన్ డ్రామా’ వార్తపై ఆయన స్పందించి ప్రకటన విడుదల చేశారు. ఇంతకాలం ప్రభుత్వం గుట్టుగా ఉంచిన జీవోను విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఇప్పటికి ఏడాదికి రూ.2 లక్షల గరిష్ట కవరేజీ ఉండగా, ఆయుష్మాన్ స్కీం విలీనంతో దానిని రూ.5 లక్షలకు పెంచినట్లు చెప్పారు. ఈ మేరకు జూన్ 2న ఇచ్చిన జీవో నెం.91ను ఇప్పుడు బయటపెట్టారు. కేంద్ర నిబంధనల ప్రకారం ఆయుష్మాన్ స్కీమ్ 25.9 లక్షల కుటుంబాలకు వర్తిస్తుందని, కానీ విలీనం చేయడంతో ఆరోగ్య శ్రీ కింద కవర్ అయ్యే మొత్తం 87.5 లక్షల కుటుంబాలకు ఈ స్కీమ్ను విస్తరించినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీలో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న 1,026 ప్యాకేజీలకు తోడు ఆయుష్మాన్లో ఉన్న 646 ప్యాకేజీలు యాడ్ చేశామన్నారు. 246 ఆరోగ్యశ్రీ ఎంప్యానల్డ్ ప్రైవేట్ హాస్పిటళ్లతో పాటు 166 ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ ఈ సేవలు ఉన్నాయన్నారు.