జైపూర్: రాజస్థాన్లో జైపూర్ లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిపోవడం వల్లే ఫైర్ యాక్సిడెంట్ సంభవించిందని జైపూర్ జిల్లా కలెక్టర్ ప్రకాశ్ రాజ్ పురోహిత్ తెలిపారు. ప్రమాదం జరిగినపుడు ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఒకరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం వార్త తెలుసుకొని అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పారు. కాగా, అగ్నిప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ ఓనర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించిందని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు సీఎం భజన్ లాల్ శర్మ సంతాపం తెలిపారు.