దుబాయ్: ఇండియా విమెన్స్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన.. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్లోనే కొనసాగుతోంది. మంగళవారం (అక్టోబర్ 21) విడుదల చేసిన తాజా జాబితాలో మంధానా 809 రేటింగ్ పాయింట్లతో నంబర్వన్ స్థానంలోనే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న విమెన్స్ వరల్డ్ కప్లో రెండు హాఫ్ సెంచరీలు చేయడం మంధానా ర్యాంక్ స్థిరంగా ఉండటానికి దోహదం చేసింది.
ఇంగ్లండ్ కెప్టెన్ సివర్ బ్రంట్ (726) రెండో ర్యాంక్లో కొనసాగుతుండగా, అలీసా హీలీ (718) ఒక్క ర్యాంక్ మెరుగుపడి మూడో స్థానంలో నిలిచింది. ఈ వరల్డ్ కప్లో మూడు సెంచరీలు చేయడం హీలీకి కలిసొచ్చింది. బెత్ మూనీ (718) నాలుగో ర్యాంక్లో మార్పులేదు. లారా వోల్వర్త్ (704) ఐదో ర్యాంక్లో ఉంది. ఇండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (619) మూడు ప్లేస్లు ఎగబాకి 15వ ర్యాంక్లో నిలిచింది.
బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ దీప్తి శర్మ (669) మూడు స్థానాలు మెరుగుపడి మూడో ర్యాంక్ను సాధించింది. వరల్డ్ కప్లో ఆడిన ఐదు మ్యాచ్ల్లో 13 వికెట్లు తీయడం ఆమెకు కలిసొచ్చింది. సోఫీ ఎకిల్స్టోన్ (778), ఆష్లే గార్డ్నర్ (686), మేగన్ షుట్ (661), మారిజానె కాప్ (654) టాప్–5లో ఉన్నారు. కిమ్ గార్త్ (654) రెండు స్థానాలు దిగి ఆరో ర్యాంక్లో నిలవగా, స్పిన్నర్ అలానా కింగ్ (644) రెండు స్థానాలు మెరుగుపడి ఏడో ర్యాంక్కు చేరింది
