
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మంగళవారం (జూన్ 17) ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో 727 రేటింగ్ పాయింట్లతో టాప్ కు చేరుకుంది. సౌతాఫ్రికా మహిళా క్రికెటర్ లారా వోల్వార్డ్ట్ను వెనక్కి నెట్టిన మంధాన ఆరేళ్ళ తర్వాత తిరిగి వన్డేల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం విశేషం. చివరిసారిగా స్మృతి 2019లో నెంబర్ ర్యాంక్ లో నిలిచింది. సౌతాఫ్రికా కెప్టెన్ వోల్వార్డ్ట్ 19 రేటింగ్ పాయింట్లు కోల్పోవడంతో స్మృతి టాప్ ర్యాంక్ కు చేరుకుంది.
లారా వోల్వార్డ్ట్ (719), ఇంగ్లాండ్ కెప్టెన్ నటాలీ స్కైవర్-బ్రంట్ (719) సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అయితే కౌంట్బ్యాక్లో వోల్వార్డ్ట్ మూడో స్థానానికి పడిపోయింది. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ అమీ జోన్స్, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ అమీ జోన్స్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. టాప్ 10 లో నాలుగు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉండడం విశేషం. స్మృతి మందాన ఇటీవలే ముగిసిన ట్రై-నేషన్ టోర్నమెంట్లో అదరగొట్టింది. మొత్తం 5 మ్యాచ్ ల్లో 52.80 యావరేజ్ తో 264 పరుగులు చేసింది. ఆమె స్ట్రైక్ రేట్ 90.41 గా ఉంది.
అదే సమయంలో ఇటీవలే వెస్టిండీస్తో ముగిసిన సిరీస్లో వోల్వార్డ్ రాణించలేకపోయింది. ఈ సఫారీ కెప్టెన్ రెండు మ్యాచ్ ల్లో వరుసగా 27, 28 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇతర భారత బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వరుసగా 14 మరియు 15వ స్థానాల్లో ఉన్నారు. బౌలర్ల విభాగంలో ఇంగ్లాండ్కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ 747 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ నాలుగో స్థానానికి చేరుకుంది.
Smriti Mandhana reclaims the No. 1 ODI spot for the first time since 2019, following a dip in Laura Wolvaardt’s rating in Tuesday’s ICC update. pic.twitter.com/hMgsKn1PFR
— CricTracker (@Cricketracker) June 17, 2025