
మహిళల వన్డే వరల్డ్ కప్ భారత జట్టు మరోసారి గెలుపు దగ్గరకు వచ్చి ఆగిపోయింది. సెమీస్ రేసులో ముందుకు సాగాలంటే గెలవాల్సిన మ్యాచ్లో ఆదివారం (అక్టోబర్ 19) ఇంగ్లాండ్ పై ఓడిపోయింది. సౌతాఫ్రికాపై గెలిచే మ్యాచ్ లో ఓడిన మన జట్టు.. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై భారీ స్కోర్ చేసి పరాజయం పాలయ్యారు. తాజాగా ఇంగ్లాండ్ పై 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఇలా ప్రతి మ్యాచ్ లో గెలుపు అందినట్టే అంది దూరమవుతుంది. ఇంగ్లాండ్ పై జరిగిన మ్యాచ్ లో ఛేజింగ్ లో స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్ 100 కు పైగా భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి బాటలు వేశారు.
మందాన, కౌర్ స్వల్ప వ్యవధిలో ఔట్ అయినా దీప్తి శర్మ హాఫ్ సెంచరీ చేయడంతో చివరివరకు టీమిండియా విజయం కొరకు పోరాడింది. కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోవడంతో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మందాన తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయింది. మ్యాచ్ ఓటమి అనంతరం కంటతడి పెట్టింది. తీవ్ర భావోద్వేగంతో తల దించుకుని ఏడుస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ లో మందాన 94 బంతుల్లో 8 ఫోర్లతో 88 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. మందాన ఉన్నంత సేపు మన జట్టు విజయంపై ధీమాగానే ఉంది. అయితే 88 పరుగుల వద్ద లాంగాఫ్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మొగ్గింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే భారీ టార్గెట్ ఛేజింగ్లో స్మృతి మంధాన (94 బాల్స్లో 8 ఫోర్లతో 88), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (70 బాల్స్లో 10 ఫోర్లతో 70), దీప్తి శర్మ (57 బాల్స్లో 5 ఫోర్లతో 50) పోరాడినా టీమిండియా విజయాన్ని అందుకోలేకపోయింది. ఫలితంగా ఆదివారం (అక్టోబర్ 19) జరిగిన లీగ్ మ్యాచ్లో ఇంగ్లండ్ 4 రన్స్ స్వల్ప తేడాతో ఇండియాపై గెలిచి సెమీస్కు క్వాలిఫై అయ్యింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 288/8 స్కోరు చేసింది. హీథర్ నైట్ (91 బాల్స్లో 15 ఫోర్లు, 1 సిక్స్తో 109) సెంచరీతో చెలరేగింది. లక్ష్య ఛేదనలో ఇండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.