
ఖైరతాబాద్, వెలుగు: సింగరేణికి బొగ్గు గనులు ఇస్తే తెలంగాణకు న్యాయం జరుగుతుందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సింగరేణి బొగ్గు గనులు సాధించుకోవడానికి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. గనుల వేలం ఆపడం అంటే రాష్ట్రంలో సామాజిక మార్పునకు పూనుకోవడమేనని చెప్పారు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోదండరాం పాల్గొని మాట్లాడారు. బొగ్గు గనులను కేంద్రం ప్రైవేటు పరం చేయబోమని తెలిపిందని.. మరి వేలం వేస్తే ప్రైవేట్కాకపోతే ఇకేం అవుతుందని ప్రశ్నించారు. వేలం వేయకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించేందుకు చట్టంలో అవకాశం ఉందన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి గనుల శాఖ మంత్రి అయిన తరువాత ‘సింగరేణిని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడండి.. అది మీ బాధ్యత’ అని తాను మెసేజ్చేసినట్లు తెలిపారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ దేశానికి శ్రేయస్కరం కాదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, విమలక్క, ఐఎఫ్టీయూ నేత అనురాధ తదితరులు పాల్గొన్నారు.