హైదరాబాద్, వెలుగు : కోర్టు తీర్పులపై పరిశీలన, అభిప్రాయాలు చెప్పే దశ నుంచి ఇప్పుడు దురుద్దేశాలను (మోటివ్స్) ఆపాదించే దాకా పరిస్థితి వచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్.ఓకా ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్లో కోర్టులు, జడ్జిలు సోషల్ మీడియా నుంచి పలు సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని, ఇది కొత్త తరం జడ్జిలకు పెద్ద సవాలేనని అన్నారు. ప్రజలకు కోర్టులపై ఉన్న విశ్వసనీయత, నమ్మకమే న్యాయవ్యవస్థకు పునాదని, ఇది బలంగా ఉంటే ఎలాంటి దురుద్దేశాలను ఆపాదించినా వాటి ప్రభావం తమపై ఉండబోదని చెప్పారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ‘సమకాలీన న్యాయ పరిణామాలు, చట్టం, సాంకేతికతతో న్యాయవ్యవస్థ పటిష్టం’ అనే అంశంపై నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సుకు శనివారం ఆయన చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ‘‘1960–80 మధ్యకాలంలో కోర్టులు, తీర్పులపై స్క్రూటినీ చాలా తక్కువగా ఉండేది. తర్వాత కాలంలో స్క్రూటినీతోపాటు ఒపీనియన్స్ కూడా వ్యక్తమయ్యేవి. ఆ దశ నుంచి సోషల్ మీడియా యుగంలో కోర్టులు, తీర్పులు, జడ్జిలకు దురుద్దేశాలను ఆపాదించే పరిస్థితి వచ్చింది. కానీ కోర్టులపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. ఇదే కోర్టుల ఆస్తి” అని జస్టిస్ అభయ్ ఓకా చెప్పారు. సత్వర, సమ న్యాయం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఆ విధంగా పనిచేసేందుకు సబ్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు జడ్జిలంతా పనిచేయాలని సూచించారు.
సమానత్వం ముఖ్యం : జస్టిస్ ఉజ్జల్ భూయాన్
సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ.. మహిళలు, పురుషుల మధ్య సమానత్వం ఎంతో ముఖ్యమని చెప్పారు. ‘‘కోర్టుల నిర్వహణ, కేసుల విచారణతోపాటు రాజ్యాంగ లక్ష్యాల అమలుకు చర్యలు తీసుకోవాలి. కులం, మతం, లింగ వివక్ష ఏదో ఒకరకంగా ఉంటున్నది. భార్యాభర్తల వివాదాల్లో.. భార్య ఎలా ఉండాలి? యవతుల వస్త్రధారణ ఎలా ఉండాలి? అనేది చెప్పే బాధ్యత కోర్టులది కాదు” అని అన్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ సుజయ్ పాల్, హైకోర్టు న్యాయమూర్తులు, తమిళనాడు. కర్నాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన జడ్జిలు ఈ సదస్సులో పాల్గొన్నారు.