- రామగుండంలో ఓపెనింగ్కు సిద్ధంగా సోలార్ ప్లాంట్
- ఈడీ చందన్ కుమార్ సమంత
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎన్టీపీసీలో 176 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ సిద్ధంగా ఉందని, నెల రోజుల్లో ప్లాంట్ను ప్రారంభిస్తామని రామగుండం, తెలంగాణ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమంత తెలిపారు. ఇందులో 120 మెగావాట్ల గ్రౌండ్ సోలార్, 56 మెగావాట్ల ప్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు. మంగళవారం ఎన్టీపీసీ ఈడీసీ హాల్లో మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎన్టీపీసీ సోలార్, హైడల్ పవర్ వంటి పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
తెలంగాణ స్టేజీ–2లో భాగంగా 2,400 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన పీపీఏ కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఎన్టీపీసీ కార్పొరేట్ మేనేజ్మెంట్ చర్చిస్తోందని చెప్పారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చిందని, కొత్తగా భూమిని సేకరించే అవసరం కూడా లేదన్నారు. ఎన్టీపీసీలో ఈ వార్షిక సంవత్సరం 13.4 బిలియన్ యూనిట్లతో 86.2 శాతం ఉత్పత్తి సాధించగా, తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్లో 9.2 బిలియన్ యూనిట్లతో 91.4 శాతం ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. సామాజిక సేవలో భాగంగా గోదావరిఖనిలో ఎస్సీ, ఎస్టీ బాలికల కోసం హాస్టల్ ను రూ.2.14 కోట్లతో నిర్మించామని చెప్పారు. గతంలో ఉన్న రూ.7 కోట్ల సీఎస్ఆర్ ఫండ్ను రూ.16 కోట్లకు పెంచామని తెలిపారు. జీఎంలు ముకుల్ రాయ్(తెలంగాణ), మనీశ్ అగర్వాల్(రామగుండం), అభిజిత్ దత్తా, బినోయ్ జోస్, రావత్, హెచ్ఆర్ ఏజీఎం బిజోయ్ కుమార్ సిక్దర్, కమ్యూనికేషన్ ఎగ్జిక్యూటివ్ శాంభవి రాయ్ పాల్గొన్నారు.
