
- కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, వెలుగు: కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ రైజింగ్–2047 సాకారం కావాలంటే మహిళా సంఘాలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. సోమవారం సెక్రటేరియట్లో సీఎస్ రామకృష్ణా రావు ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కార్యకలాపాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా సంఘాలతో సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల ఏర్పాటు, నూతన మహిళా సభ్యుల గుర్తింపు, కిశోర బాలికలు, దివ్యాంగులు, వయోధిక మహిళా సంఘాల ఏర్పాటు, ఇందిరమ్మ మహిళా శక్తి భవనాల నిర్మాణ పనుల పురోగతి, మహిళా సంఘాలతో ప్రభుత్వ స్కూళ్ల యూనిఫాంల సరఫరా తదితర అంశాలపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాలతో సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించేలా కలెక్టర్లు కృషి చేయాలని, అందుకు అవసరమైన స్థలాలను గుర్తించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఇప్పటికే జిల్లాల వారీగా సోలార్ ఇన్స్టాలేషన్ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయని, వారితో సమన్వయం చేసుకొని అక్టోబర్ 2న సోలార్ ప్లాంట్లు ప్రారంభించేలా దృష్టి పెట్టాలని సూచించారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణ పనులను నవంబర్లోపు పూర్తి చేయాలని చెప్పారు.
ఐదేండ్లలోపు చిన్నారులకు వైద్య పరీక్షలు..
బాల భరోసా పేరుతో కొత్త స్కీమ్ను తీసుకొస్తున్నామని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇందులో భాగంగా ఐదేండ్ల లోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయిస్తామని, ఏదైనా సమస్య ఉంటే అవసరమైన సర్జరీలు కూడా ఉచితం చేయిస్తామని చెప్పారు. ఈ నెల 11న తెరుచుకోనున్న అంగన్ వాడీల్లో చిన్నారులు చేరేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మహిళా స్వయం సహాయక బృందాల్లో కొత్త సభ్యులను చేర్పించాలని సూచించారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చేతిలో పేద మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే అర్హులైన మహిళలు ఈ గ్రూపుల్లో ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.