నిజామాబాద్ జిల్లాలో విస్తరిస్తున్న సోలార్

నిజామాబాద్ జిల్లాలో విస్తరిస్తున్న సోలార్
  • 253 కమర్షియల్, 916 ఇండ్లలో సోలార్ పవర్​
  • ఆరు చోట్ల సోలార్​చార్జింగ్ స్టేషన్లకు రెడ్​కో టెండర్లు​
  • కలెక్టరేట్ సహా ప్రభుత్వ ఆఫీసుల్లోనూ సోలార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
  • సూర్యాఘర్ స్కీమ్​ కింద 30 గ్రామాల ఎంపిక 

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో సోలార్ సిస్టం విస్తరిస్తోంది. విద్యుత్​ ఖర్చు ఆదా కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వందల సంఖ్యలో సోలార్ సిస్టమ్​ ఏర్పాటవుతోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్టాండ్లు, పలు హాస్టళ్లలో సోలార్ సిస్టమ్​ ఏర్పాటు చేయగా, అన్ని ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. కమర్షియల్ రంగంలో సోలార్​ విద్యుత్ వల్ల ప్రతి నెలా సుమారు రూ.5 లక్షల కరెంట్ బిల్లు  ఆదా అవుతోంది.     

 షాపింగ్ మాల్స్, థియేటర్స్, రైస్ మిల్లుల్లో.. ​

దాదాపు రూ.3.5 కోట్ల ఖర్చుతో ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 1000 కిలోవాట్లకు సమానమైన ఈ పవర్​తో 3 నుంచి 5 చిన్న రైస్​మిల్లులు లేదా  2 పెద్ద మిల్లులను రన్ చేయవచ్చు. 24 గంటలు సెంట్రల్ ఏసీ నడిచే ప్రైవేట్ హాస్పిటల్స్, షాపింగ్​ మాల్స్, థియేటర్లకు నెలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కరెంట్ బిల్లు వస్తోంది. దీంతో జిల్లాలోని 253 మంది వ్యాపారులు రూ.వంద కోట్లకు పైగా ఖర్చుచేసి సోలార్ సిస్టమ్​ ఏర్పాటు చేసుకున్నారు.

916 ఇండ్ల యజమానులు ఒక్కొక్కరు రూ.2 లక్షల చొప్పున పోగు చేసి సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోగా, నెలకు రూ.20 లక్షల కరెంట్ బిల్లు ఆదా అవుతోంది. సోలార్ పవర్​ఏర్పాటుకు బ్యాంకర్లు తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తుండడంతో పాటు కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది.  

సర్కార్ ఆఫీసుల్లో..

ఇందూర్, ఆర్మూర్, బోధన్​ ఆర్టీసీ డిపోల్లో ఇప్పటికే సోలార్ పవర్ వినియోగిస్తున్నారు. నగరంలోని కోర్టు కాంప్లెక్స్ బిల్డింగ్, డిచ్​పల్లి మండలంలోని సుద్దులం,  పోచంపాడ్ రెసిడెన్షియల్ కాలేజీలు, బోధన్​ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సోలార్ సిస్టం ఏర్పాటు చేశారు. దీంతో రూ.లక్షల కరెంట్ బిల్లు ఆదా అవుతోంది. అన్ని ప్రభుత్వ బిల్డింగ్​లకు సోలార్​ పవర్​ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత వారం అధికారులకు ఆదేశాలివ్వగా, ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

కలెక్టరేట్ సహా 545 పంచాయతీ ఆఫీస్​లు, 1,156 స్కూల్స్, 137 హాస్పిటల్స్, 151 గురుకులాలు, జిల్లావ్యాప్తంగా ఉన్న 58 గవర్నమెంట్ ఆఫీసుల్లో సోలార్​ సిస్టం కోసం ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు.  పెట్రోల్ బంకుల మాదిరిగా ఎలక్ట్రిక్ వెహికల్స్​కు జిల్లాలో ఆరు సోలార్​పవర్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఆర్మూర్, డిచ్​పల్లి, గన్నారం, సాలూరా, ముగ్పాల్, పెర్కిట్ లలో వీటిని నెలకొల్పేందుకు రెడ్​కో ఈ నెల టెండర్లు పూర్తి చేసింది. సూర్యాఘర్ ముఫ్త్​ బిజిలీ యోజన కింద అధికారులు 30 గ్రామాలను ఎంపిక చేసి సోలార్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు.

ప్రభుత్వ ఆఫీసుల్లోనూ సోలార్​

ప్రభుత్వ ఆఫీసుల్లో సోలార్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. వ్యాపారులు సోలార్​ సిస్టం ఏర్పాటు చేసుకుని ఖర్చు తగ్గించుకున్నారు. జిల్లాలో కొన్ని ఇండ్లు కలిసి సోలార్ పెట్టుకోవడం అభినందనీయం. సోలార్ సిస్టంపై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.- రమణ, జిల్లా మేనేజర్, రెడ్​కో