ఓయూ, వెలుగు: ఓయూలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సోమవారం ఓయూ ఆర్ట్స్కాలేజీలో జరుగుతున్న సోషియాలజీ సదస్సుకు మంత్రి పొంగులేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మంత్రిని కలిసి ఆయా సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఫెలోషిప్, మెస్బకాయిలు, హాస్టళ్లలో అరకొర వసతుల సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. పరిశోధనా విద్యార్థులకు ప్రతినెలా రూ.30 వేల ఫెలోషిప్ఇవ్వాలని, మెస్బకాయిలు రద్దు చేయాలని, యూనివర్సిటీలో విద్యార్థిని, విద్యార్థులకు సరైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి, ఎంఎస్టీఎస్ అధ్యక్షుడు ఎల్. నాగరాజు, ఎస్టీఎస్ఏ అధ్యక్షుడు తాళ్ల అజయ్, బీఎస్పీ నాయకులు రుద్రారం సునీల్, ఏఐఎస్ఎఫ్ నాయకులు రాహుల్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రంలోఉన్న అన్ని ప్రభుత్వ విశ్వ విద్యాలయాల్లో బోధనా, బోధనేతర ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ గిరిజన శక్తి సంఘం నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను పాత విధానంలోనే భర్తీ చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన శక్తి నాయకులు శరత్ నాయక్, సుబ్బు నాయక్, రమేశ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.