మరో 300 మందికి గాయాలు
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన రెండు వరుస పేలుళ్లలో 100 మంది చనిపోయారు. 300 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. జనాలు ఎక్కువగా ఉన్న ఏరియాను టార్గెట్ చేసుకుని రెండు కారు బాంబులు పేల్చినట్టు సొమాలియా ప్రెసిడెంట్ హసన్ షేక్ మహమ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేలుళ్ల వివరాలను వెల్లడించారు.
తొలుత జోబ్ చౌరస్తాలోని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వద్ద పేలుడు జరిగిందని చెప్పారు.ఆ ఏరియాలో వీధి వ్యాపారులు ఎక్కువగా ఉంటారని తెలిపారు. గాయపడిన వారిని తీసుకెళ్లేందుకు అంబులెన్స్లు, పోలీసులతో పాటు ఏంజరిగిందో తెలుసుకుందామని అక్కడికి జనం చేరుకున్న తర్వాత రెండో బ్లాస్ట్ జరిగిందని హసన్ షేక్ చెప్పారు. లంచ్ టైం కావడంతో కస్టమర్స్తో బిజీగా ఉండే ఓ రెస్టారెంట్ ముందు రెండో పేలుడు సంభవించిందని చెప్పారు. కాగా, ఫస్ట్ బ్లాస్ట్ను కవర్ చేసేందుకు వెళ్లిన ఒక జర్నలిస్ట్ రెండోసారి జరిగిన పేలుడులో చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఓ అంబులెన్స్ తుక్కుతుక్కు అయ్యింది. గాయపడినవారిని ఆస్పత్రుల్లో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్లు ప్రెసిడెంట్ వివరించారు. అల్ షబాబ్ టెర్రర్ గ్రూప్ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చన్నారు. 2017లో ఇదే స్పాట్లో ట్రక్ బాంబు పేల్చారని, అప్పుడు 500 మంది వరకు చనిపోయారని అన్నారు. ఈ ఘటనకు కూడా ఏ టెర్రరిస్టు గ్రూప్ బాధ్యత వహించలేదని ప్రెసిడెంట్ వివరించారు.