- 70 శాతం సంస్థల అభిప్రాయం ఇదే
- ‘ఆఫీస్’ నిర్వహించిన సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయించడానికి 70 శాతం సంస్థలు ఇష్టపడటం లేదు. ఆఫీసులకు రావాలని అడుగుతున్నాయి. ఆఫీసు నుంచే పనిచేయాలని కోరుకుంటున్నామని 90 శాతం ఫార్మా కంపెనీలు అంటున్నాయి. అయితే టెక్నాలజీ, రిటైల్ సెక్టార్ కంపెనీల్లో 50 శాతం కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని కోరుకుంటున్నాయి. టెక్ ఎనబుల్డ్ వర్క్ప్లేస్ ప్రొవైడర్ ‘ఆఫీస్, క్యూడీఈఎస్క్యూ’ కలిసి చేసిన సర్వే ద్వారా ఈ వివరాలు తెలిశాయి. రాబోయే 12 నెలల్లో మెజారిటీ కార్పొరేట్లు తమ బిజినెస్ను పెంచుకోవాలని లేదా విస్తరించాలని చూస్తున్నాయని, అయితే 40శాతం కంపెనీలు ఇప్పటికీ హైబ్రిడ్ వర్కింగ్ ఆలోచనను ఇష్టపడుతున్నాయని సర్వే పేర్కొంది. ఆన్–డిమాండ్, ఫ్లెక్సిబుల్ ఆఫీసులకు డిమాండ్ పెరుగుతున్నందున ఈ మార్కెట్ ఇంకా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. " ఫ్లెక్స్ స్పేస్ ఆపరేటర్లకు మంచి భవిష్యత్ ఉంది. విస్తరణకు ఎన్నో అవకాశాలను కూడా దక్కించుకోవచ్చు. ఈ తరహా ఆపరేటర్లు నగరాల్లో తమ ఉనికిని పెంచుకోవడానికి ఇది మంచి సమయం. అన్ని రకాల ఎంటర్ప్రైజెస్ల అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేయాలి”అని ‘ఆఫీస్’ ఫౌండర్ అమిత్ రమణి అన్నారు. అన్ని సైజుల కంపెనీల్లో దాదాపు 35–-40శాతం హైబ్రిడ్ పని విధానాన్ని ఇష్టపడతాయని సర్వే పేర్కొంది.
కరోనాతో పని పద్ధతులు మారాయ్..
కరోనా సమయంలో ఎక్కువ మంది ఫ్లెక్సిబిలిటీ (నచ్చినట్టుగా పనిచేసుకోవడం)కి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు కూడా మెజారిటీ ఉద్యోగులు ఇదే విధానాన్ని కోరుకుంటున్నారు. అనేక ప్రదేశాలలో కంపెనీలు ఆఫీసులను డెవెలప్ చేస్తున్నప్పటికీ, హైబ్రిడ్ వర్క్ మోడల్ను కూడా కొనసాగించడానికి సంస్థలు ఫ్లెక్స్ స్పేస్ ఆపరేటర్లతో కలసి పనిచేస్తున్నాయి. దాదాపు 45శాతం కార్పొరేషన్లు ఫ్లెక్స్ ఆఫీసులతోపాటు కొత్త ఆఫీసుల నిర్మాణం కోసం నగరాల్లో జాగాలను కొంటున్నాయి. వీటిలో 35శాతం ఇప్పటికే కోవర్కింగ్ స్పేస్ఆపరేటర్ల సహకారంతో మల్టీ–-ఆఫీస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ‘‘కరోనా తరువాత కో–వర్కింగ్ స్పేస్ ఇండియాలో బాగా ఎదిగింది. ఇప్పుడు చాలా కంపెనీలు ఈ విధానానికి మారాయి’’ అని ‘ఆఫీస్’ డిప్యూటీ సీఈఓ సుమిత్ లఖానీ అన్నారు. 70శాతానికిపైగా చిన్న సంస్థలు ఆఫీసు నుండి ఉద్యోగులతో పని చేయించడానికి మొగ్గుచూపుతున్నాయి. అయితే పెద్ద సంస్థల్లో 70శాతం కంపెనీలు హైబ్రిడ్ను ఇష్టపడుతున్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో చాలా మంది రెస్పాండెంట్లు తమ ఉద్యోగుల పని అవసరాలను తీర్చడానికి కోవర్కింగ్ కంపెనీలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. అయితే 30శాతం కంపెనీలు మాత్రం తక్కువ ఖర్చు గల ఆఫీసుల కోసం వెతుకుతున్నాయి. "మారుతున్న మార్కెట్ డైనమిక్స్తో సంస్థలు అభివృద్ధి చెందుతున్నందున హైబ్రిడ్, వర్క్ ఫ్రం హోం, ఆఫీస్ విధానాలూ మారాయి. కోవర్కింగ్ స్పేస్కు గిరాకీ పెరిగింది ”అని క్యూడీఈఎస్క్యూ సీఈఓ పారస్ అరోరా అన్నారు.