తుమ్మలతో ఎంపీ నామా భేటీ

తుమ్మలతో ఎంపీ నామా భేటీ
  • పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచన

ఖమ్మంరూరల్, వెలుగు: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్​రావు బుధవారం హైదరాబాద్​లోని తుమ్మల నివాసంలో భేటీ అయ్యారు. గంటకుపైగా వీరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. పాలేరు టికెట్​ దక్కకపోవడంపై తుమ్మల కొంత నిరాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తారని సీఎం మాటగా చెప్పమన్నారని తుమ్మలకు వివరించారు. దీనిపై తుమ్మల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నామా, ఎమ్మెల్యే భాస్కర్​రావు వెనుదిరిగినట్టు సమాచారం.

తుమ్మలకు టికెట్​ రాకపోవడంపై ఆగ్రహంతో ఉన్న ఆయన అనుచరులు ఎలాగైనా పోటీలోఉండాలని ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. అవసరమైతే కాంగ్రెస్​ నుంచైనా బరిలో ఉండాలని కోరుతున్నారు. ఈ నెల 25న హైదరాబాద్​ నుంచి తుమ్మల ఖమ్మం రానున్నారు. జిల్లా సరిహద్దు మామిళ్లగూడెం వద్ద వెయ్యి కార్లతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే కాంగ్రెస్​ పార్టీలో చేరికపై ప్రకటన చేయించే విధంగా ప్లాన్​ చేస్తున్నారు. బుధవారం సత్తుపల్లి, వైరా, ఇల్లెందు నియోజకవర్గాల్లో తుమ్మల అనుచరులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి మద్దతు ప్రకటించారు.