ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారాలోకేష్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ పాదయాత్రలో రాయలసీమను అభివృద్ధి చేస్తామని ఎలా హామీలు ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. 14 సంవత్సరాల పాటు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటికీ.. రాయలసీమకు ఏమీ చెయ్యలేదని దుయ్యబట్టారు. మళ్లీ రాయలసీమను అభివృద్ధి చేస్తామంటే, ప్రజలు నమ్మరని తేల్చి చెప్పారు.
నంద్యాలలో బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్లు వేసింది కేంద్రంలో ఉన్న తమ బీజేపీ ప్రభుత్వమేనని,... వైసీపీ ప్రభుత్వం ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. ఏపీలో తాము అభివృద్ధి చేస్తే.. జగన్ సర్కార్ తమ స్టిక్కర్లు వేసుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా లేవని, ఎంపీ ఫ్యామిలీనీ కిడ్నాప్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు.